రూ.19 లక్షల కారు రూ. 2 లక్షలకే..?!

8 Jun, 2019 20:57 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : చోర కళలో నేరగాళ్లు రోజు రోజుకు ఆరి తేరి పోతున్నారు. బెంగళూరు లోని నిస్సాన్‌  షోరూంకి కుచ్చు టోపీ పెట్టి ఖరీదైన కారుతో  చల్లగా జారుకున్నాడు. డౌన్‌ పేమెంట్‌ చెల్లించి మరీ యజమానిని నమ్మించి ఉడాయించాడు. సుమారు 19లక్షల విలువ చేసేకారును కేవలం రూ. 2 లక్షల రూపాయలకు ఎగరేసుకుపోయాడో ప్రబుద్దుడు.  అయితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో తలపట్టుకోవడం పోలీసుల వంతైంది. 

విలాసవంతమైన ఎస్‌యూవీ నిస్సాన్‌ కిక్స్‌ను కొనుగోలు  చేస్తానంటూ షోరూంకి వచ్చాడు జోస్ థామస్ అకా జోసెఫ్. షోరూం మేనేజర్‌ని అడిగి వివరాలు తెలుసుకున్నాడు.  ధర రూ 18.6 లక్షలని చెప్పగానే వెంటనే రూ. 2 లక్షల  డౌన్‌ పేమెంట్‌ కట్టి.. పూజా కార్యక్రమాలను చేయించుకుంటానని చెప్పి  బురిడీ కొట్టించి కారును తీసుకెళ్లాడు. అంతే ఇక అక్కడనుంచి పత్తా లేకుండాపోయాడు.  ఎన్ని ఫోన్లు చేసినా సమాధానం లేదు.  అతని ఆఫీసుకు వెళ్లినా.. ఫలితం శూన్యం. చివరికి పోలీసులను ఆశ్రయించారు. అయితే ఇందులో  ట్విస్టు ఏంటంటే...ఈ సంఘటన జరిగి నాలుగు నెలలైంది.  

జనవరి 23న బెంగళూరులోని దొడ్డనకుంది సూర్య నిస్సాన్‌ షోంరూంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దాదాపు నాలుగు నెలల తరువాత  అంటే మే 21వ  తేదీన షోరూం యజమాని గణేశ్‌ కుమార్‌ శెట్టి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  ఇంత ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేశారన్నదానిపై స్పందించేందుకు గణేష్ తిరస్కరించారు.

గణేశ్‌ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని సంబంధిత డీసీపీ అబ్దుల్‌ అహద్‌ తెలిపారు. నిందితుడు ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌, ఆఫీస్‌ అడ్రస్‌  ఆధారంగా వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు.  సంఘటన జరిగిన నాలుగు నెలల తర్వాత ఫిర్యాదు చేశారు కాబట్టి కేసు దర్యాప్తునకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

>
మరిన్ని వార్తలు