చెన్నై, టీ.నగర్: చెన్నై, తాంబరంలో వివాహేతర సంబంధానికి అడ్డు ఉందని కన్నతల్లిని సజీవ దహనం చేసిన కుమార్తెను, అందుకు సహకరించిన ప్రియుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాలు.. తాంబరం సమీపం క్రోంపేట దుర్గానగర్కు చెందిన సదాశివం భార్య భూపతి (60). అదే ప్రాంతంలో వీరి కుమార్తె నందిని (27) నివశిస్తోంది. ఈమె భర్త కన్నన్ (30) కార్మికుడు. ఇలా ఉండగా నందినికి అదే ప్రాంతానికి చెందిన మురుగన్ (45)తో వివాహేతర సంబంధం ఏర్పడింది.
విషయం తెలిసి భూపతి నందినిని మందలించింది. అయినప్పటికీ నందిని మురుగన్తోనే సంబంధం కొనసాగించినట్లు తెలిసింది. తల్లి మాటలకు విసిగిపోయిన నందిని ప్రియుడు మురుగన్తో కలిసి ఆమెను హతమార్చేందుకు కుట్ర పన్నింది. సంఘటన జరిగిన రోజు తల్లి ఇంటికి వచ్చిన నందిని ఆమె నిద్రిస్తుండగా ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఏమీ తెలియనట్లు నాటకమాడిన నందిని ఇరుగుపొరుగువారితో కలిసి తల్లిపై నీళ్లుపోసి మంటలు ఆర్పింది. సమాచారంతో పోలీసులు సంఘటన స్థలం చేరుకుని ఆమెను చికిత్స నిమిత్తం కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ భూపతి మృతిచెందింది. పోలీసుల విచారణలో నందిని ఆమెను హతమార్చినట్లు తెలిసింది. నందినితోపాటు కుట్రకు సహకరించిన మురుగన్ను పోలీసులు అరెస్టు చేశారు.