వైద్యురాలు శ్రావణి ఆత్మహత్య

11 Dec, 2019 11:45 IST|Sakshi

అమీర్‌పేట: జీవితం విరక్తి చెంది ఓ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కళ్యాణ్‌నగర్‌కు చెందిన శ్రావణి (35) వైద్యురాలిగా పని చేస్తోంది. కొన్నేళ్ల క్రితం విబేధాల కారణంగా భర్తతో విడిపోయింది. ఆమెకు ఓ కుమారుడు(6) ఉన్నాడు. కాగా శ్రావణి గత నవంబర్‌ 1న శ్రీనివాస్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను రెండో పెళ్లి చేసుకుంది. శ్రీనివాస్‌ ఉద్యోగం చేసేందుకు తమిళనాడు వెళ్లగా తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. మంగళవారం ఉదయం ఆమె బాత్‌రూమ్‌లో కిటికీకి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం  ఆమె తల్లి తలుపులు తట్టినా లోపల నుంచి సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు విరగొట్టి  చూడగా శ్రావణి ఉరికి వేలాడుతూ కనిపించింది. 

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘తల్లి దండ్రులు తనను బాగా చూసుకున్నారని, తొందరపడి రెండో వివాహం చేసుకున్నానని, అతడు ఎలా చూసుకుంటాడో తెలియదని, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని అందులో పేర్కొంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు