షబానా అజ్మీ డ్రైవర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

19 Jan, 2020 15:03 IST|Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ నటి షబానా అజ్మీ కారు డ్రైవర్‌ అమ్లేష్‌ యోగేంద్ర కామత్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.  అతి వేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా మహారాష్ట్రలోని రాయగఢ్‌ జిల్లాలో ముంబై–పుణే ఎక్స్‌ప్రెస్‌ హైవేపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిదంటూ ట్రక్‌ డ్రైవర్‌ రాజేష్‌ పాండురంగ విఠల్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. షబానా అజ్మీ ప్రయాణిస్తున్న టాటా సఫారీ వాహనం తన ట్రక్కును ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో వేగంగా ఢీకొట్టినట్లు అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండిరోడ్డు ప్రమాదంలో షబానా అజ్మీకి తీవ్ర గాయాలు)

కాగా ఈ ప్రమాదంలో గాయపడ్డ షబానా అజ్మీని చికిత్స నిమిత్తం ముందుగా  ముంబైలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం కోకిలాబెన్‌ ఆస్పత్రికి మార్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో షబానా అజ్మీ భర్త, బాలీవుడ్ గీత రచయిత జావేద్ అఖ్తర్  చిన్న గాయాలతో బయటపడ్డారు. మరోవైపు షబానా అజ్మీని పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు పరామర్శించారు. 

మరిన్ని వార్తలు