మాజీ ఎంపీ భార్య హత్య కేసులో కుమారుడి అరెస్టు

31 Jul, 2019 09:04 IST|Sakshi

చెన్నై: మాజీ ఎంపీ కుళందైవేలు భార్య హత్య కేసులో ఢిల్లీలో దాగి ఉన్న కుమారుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. తిరుచెంగోడు నియోజకవర్గం అన్నాడీఎంకే మాజీ ఎంపీ కుళందైవేలు నాలుగేళ్ల క్రితం మృతి చెందారు. ఇతని భార్య రత్నం (63) చెన్నై శాస్త్రీనగర్‌ ఆరో అవెన్యూలో నివసిస్తున్నారు. వీరికి సుధా అనే కుమార్తె, ప్రవీణ్‌ (35) అనే కుమారుడు ఉన్నారు. సుధాకు వివాహమై తిరుపూర్‌లో ఉంటోంది. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ప్రవీణ్‌ మార్చి నెలలో స్వదేశానికి వచ్చారు. ఆ సమయంలో అతను విదేశంలో ఒక యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నట్లు సమాచారం.

వివాహ విషయం, ఆస్తికి సంబంధించి తల్లికి, కుమారుడికి మధ్య తగాదా ఉంటూ వచ్చింది. దీంతో ఏప్రిల్‌ 14న రాత్రి ప్రవీణ్‌ తల్లి అని కూడా చూడకుండా రత్నం చేతులు, కాళ్లు కట్టివేసి గొంతు కోసి, గుండెలపై కత్తితో పొడిచి హత్య చేశాడు. తర్వాత ఇంటిలో మృతదేహాన్ని ఉంచి బయట గడియవేసి తప్పించుకున్నాడు. దీని గురించి శాస్త్రినగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి ప్రవీణ్‌ కోసం గాలిస్తూ వచ్చారు. ఇలా ఉండగా ఢిల్లీలో ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి సోమవారం అరెస్టు చేశారు.   

మరిన్ని వార్తలు