భార్య పాపులారిటీని తట్టుకోలేక ఆమెను..

21 Jan, 2020 15:31 IST|Sakshi

సోషల్‌ మీడియాలో భార్యకు వస్తున్న గుర్తింపును తట్టుకోలేని ఓ భర్త ఆమెను కిరాతకంగా హతమార్చాడు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన అయాజ్‌ అహ్మద్‌(25) ఆన్‌లైన్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇతను రేష్మా(22) అనే యువతిని రెండేళ్ల క్రితం ఆర్య సమాజంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి మూడు నెలల పాప కూడా ఉంది. కొన్నేళ్లు సవ్యంగానే సాగిన వీరి దాంపత్యం తరువాత అనుమానులకు దారితీసింది.  మహిళకు ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో 6వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలో భార్యకు ఉన్న ఫాలోయింగ్‌ చూసిన భర్తకు ఆమెపై  అసూయ ఏర్పడింది. కుటుంబంతో కంటే సోషల్‌ మీడియాలోనే ఎక్కువ సమయం కేటాయిస్తుందన్న నేపంతో తరచూ ఆమెతో వాగ్వాదానికి దిగేవాడు. అలాగే భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని అనుమానం మొదలవ్వడంతో రోజూ గొడవపడేవారు.

ఈ గొడవ కాస్తా పెరిగి పెద్దదవడంతో కొన్ని రోజుల క్రితం భర్తను విడిచిపెట్టిన భార్య తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. ఇది తట్టుకోలేక పోయిన భర్త అహ్మద్‌ ఆదివారం సాయంత్రం తాగిన మత్తులో  ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లి భార్యను తిరిగి ఇంటికి రావాలని బతిమాలాడు. ఇందుకు భార్య సమ్మతించడంతో ఆమెను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో భారీ బండరాయితో ఆమె తలమీద బాదాడు. అనంతరం గొంతు కోసి చంపాడు. సోమవారం ఉదయం మృతదేహాన్ని గర్తించిన పోలీసులు కొన్ని గంటల్లోనే అయాజ్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

మరిన్ని వార్తలు