చదువుకుంటాననడమే పాపమా..?

16 Jun, 2019 15:00 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: పిల్లల్ని చదివించడానికి రేయింబవళ్లు కష్టపడుతూ ఒళ్లు హూనం చేసుకుంటున్న తండ్రులను చూశాం. కానీ చదువుతానన్నందుకు ఏకంగా చంపడానికే ప్రయత్నించాడో కసాయి తండ్రి. ఈ హృదయ విదారకమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.. ఇంకా చదువుకోవాలనుందని 15 సంవత్సరాల కూతురు తండ్రితో చెప్పింది. ఇది ఇష్టం లేని తండ్రి కోపాన్ని పెంచుకున్నాడు. కన్న కూతురన్న కనికరం లేకుండా కత్తితో పొడిచి బాలికను కాలువలో పడేశాడు. ఆమె అతికష్టం మీద ఈదుకుంటూ తప్పించుకుంది.

ఈ ఘటన గురించి బాధితురాలి బావ పోలీసులకు తెలియజేశాడు. తన అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఇష్టం లేని పెళ్లి చేస్తారేమోననే భయంతోనే బాలిక ప్రస్తుతం బిక్కుబిక్కుమంటూ గడుపుతోందని ఆయన  చెప్పాడు. ‘నాన్న నన్ను కాలువ దగ్గరకు తీసుకెళ్లాడు. నా సోదరుడితో కలిసి నన్ను చంపాలని చూశాడు. నా సోదరుడు వస్త్రంతో నా గొంతు నులుముతుంటే, నాన్న వెనక నుంచి కత్తితో పదేపదే పొడిచాడు. నన్ను చంపొద్దు నాన్నా అంటూ ఎంత బతిమాలుకున్నా అతను వినలేదు. అతను నా చదువు ఆపించేసి పెళ్లి చేయాలని చూశాడు. దానికి అడ్డు చెపినందుకు నా ప్రాణాల్ని తీయాలనుకున్నాడు’ అని చెప్పింది. 

మరిన్ని వార్తలు