ఉగ్ర భీతి

26 Sep, 2019 07:42 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు

బెంగళూరులో ఎన్‌ఐఏ సోదాలు

పేలుడు పదార్థాలు స్వాధీనం  

కర్ణాటక, బనశంకరి: దేశంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడవచ్చనే హెచ్చరికల నేపథ్యంలో ఐటీ రాజధానిలో విస్ఫోటక పదార్థాలు దొరకడం సంచలనమైంది. బెంగళూరులో బంగ్లాదేశ్‌ కు చెందిన జమాత్‌ ఉల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది తలదాచుకున్న ఇంటిపై ఎన్‌ఐఏ అధికారులు దాడిచేసి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఎన్‌ఐఏ అదుపులో ఉన్న జేఎంబీ ఉగ్రవాది జహిదుల్‌ ఇస్లాం అలియాస్‌ కౌసర్‌ విచారణ సమయంలో బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు చెప్పాడు.

దీంతో మంగళవారం రాత్రి ఎన్‌ఐఏ అధికారులు ఓ ఇంటిపై రహస్యంగా దాడి చేశారు. గదిలో ఎవరూ లేరు. పేలుడు వస్తువులు తయారు చేసే సమాచారం, కొన్ని ఉత్తరాలు, ప్లాస్టిక్‌ టేపుతో చుట్టిన బ్యాటరీ, కెపాసిటర్, మూడు స్విచ్‌లు, ఒక మైక్రో లిథియం బాటరీ, ఒక ప్లాస్టిక్‌ బాక్స్‌ను కనుగొన్నారు. చేతి గ్లౌజ్‌లు, గుర్తింపుకార్డులు, ఇంటి అద్దె ఒప్పంద పత్రం, బెంగాళీ బాషలో రాసిన పత్రం, ఒక డిజిటల్‌ కెమెరా, 2018లో బెంగళూరులో దొంగగించిన కొన్ని వెండిపాత్రలను కూడా ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులోని అత్తిబెలె, కాడుగోడి, కేఆర్‌.పురం, చిక్కబాణవార, శికారిపాళ్య, ఎలక్ట్రానిక్‌సిటీ ప్రాంతాల్లో ఉగ్రవాదులకు సహాయపడే సహాయకులు గుట్టుగా మకాం వేసినట్లు మరోసారి వెల్లడైంది.  

మరిన్ని వార్తలు