ప్రాణం తీసిన వేగం

19 Dec, 2018 11:42 IST|Sakshi
తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లిన రవీందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి (ఫైల్‌)

వెల్దండ (కల్వకుర్తి): రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో భాగంగా భూములు పరిశీలించేందుకు బయలుదేరిన వారిని మృత్యువు వెంటాడింది.. వేగంగా దూసుకెళ్లిన కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం పాలవగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని చెర్కూరు గేట్‌ సమీపంలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే క్రమంలో కల్వకుర్తిలో ఉన్న భూములను చూసేందుకు కల్వకుర్తి పట్టణానికి చెందిన కుడుముల రవీందర్‌రెడ్డి(50), హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ మండలం జిల్లెలగూడ గ్రామ మాజీ సర్పంచ్‌ చల్లా సుధాకర్‌రెడ్డి(55), సింహారెడ్డి, సుదర్శన్‌రెడ్డి మంగళవారం ఉదయం వచ్చి పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న సమయంలో తిరిగి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు.

వేగంగా దూసుకెళ్లిన కారు మార్గమధ్యలో వెల్దండ మండలం చెర్కూర్‌గేట్‌ సమీపంలో హైదరాబాద్‌– శ్రీశైలం రహదారిపై అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వెల్దండ ఎస్‌ఐ వీరబాబు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని  స్థానికుల సహకారంతో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో రవీందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డిలను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన సింహారెడ్డిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. సుదర్శన్‌రెడ్డి కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రవీందర్‌రెడ్డికి భార్యతోపాటు కుమార్తె ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన సుధాకర్‌రెడ్డికి భార్య కవితతోపాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

మరిన్ని వార్తలు