సైబర్‌ నేరగాళ్ల పట్ల.. అప్రమత్తంగా ఉండాలి

24 Jul, 2018 13:19 IST|Sakshi
సీపీకి ఫిర్యాదు చేస్తున్న బాధితులు 

ప్రజాదివస్‌లో సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌

ఖమ్మంక్రైం : సైబర్‌ నేరగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని  పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ అన్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మాయమాటలతో ఖాతాదారుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కాజేసే ఆన్‌లైన్‌ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజాదివస్‌ కార్యక్రమంలో సీపీకి పలువురు ఫిర్యాదులు అందజేశారు. నేలకొండపల్లికి చెందిన చెరుకూరి వీరబాబుకు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ చేసి ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని, ఇన్సూరెన్స్‌ డబ్బు వచ్చిందని, బ్యాంకులో డిపాజిట్‌ చేస్తామని చెప్పి ఏటీఎం కార్డు నంబర్‌ తీసుకున్నాడు.

ఆ అకౌంట్‌లో నగదు లేకపోవడంతో మరో నంబర్‌ ఇవ్వమని అడగడంతో సమీప బంధువుల ఏటీఎం నంబర్‌ తీసుకుని ఇచ్చాడు. ఓటీపీ నంబర్‌ చెప్పడంతో ఖాతాలోని రూ.32 వేలు కాజేశారు. కొంతసేపటి తర్వాత గుర్తించిన బాధితులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే మరికొన్ని ఫిర్యాదులను బా«ధితులు సీపీకి అందజేశారు. ఇలా ఫోన్‌ చేసి నంబర్లు చెప్పమని అడిగితే చెప్పొద్దని, వారి సెల్‌ నంబర్‌ను పోలీసులకు తెలియజేయాలని సీపీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు