చనిపోవడానికి వెళ్లిన ఏడుగురు కుటుంబ సభ్యులు..

20 Jan, 2016 20:32 IST|Sakshi
చనిపోవడానికి వెళ్లిన ఏడుగురు కుటుంబ సభ్యులు..

పటాన్‌చెరువు: కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తికి వెళ్తన్నామని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన ఏడుగురు కుటుంబ సభ్యులు అదృశ్యం అయిన సంఘటన పటాన్‌చెరువు మండలం అమీన్‌పూర్‌లో బుధవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న బిమయ్య(50) కుటుంబం ఈ నెల 15న శ్రీకాళహస్తికి వెళ్తున్నామని చెప్పి ఇంట్లోనుంచి వెళ్లారు. ఈ క్రమంలో రెండు రోజుల నుంచి బిమయ్య పెద్ద కూతురు తండ్రితో మాట్లాడటం కోసం ప్రయత్నిస్తుండగా.. ఫోన్ స్విచ్ఛాప్ వస్తుండటంతో ఇంటికి వచ్చి చూసింది. ఇంటికి తాళం వేసి ఉండటంతో.. పోలీసులకు ఫిర్యాదు చేసి వారి సాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా.. ఇంట్లో ఓ సూసైడ్ నోట్ లభించింది.

నోట్ సారాంశం..
అప్పుల బాధను భరించలేకపోతున్నాం.. వస్త్రాల వ్యాపారంలో తీవ్రంగా నష్టం పోయాం. ఇళ్లు కట్టడానికి తెచ్చిన అప్పులు కూడా భారీగా పెరిగిపోయాయి. దీంతో బతకాలనే ఆశ చచ్చిపోయింది. కుటుంబ సభ్యులమంతా కలిసి శ్రీకాళహస్తిలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అందుకే వెళ్తున్నాం.. మాకోసం వెతకొద్దు అని సూసైడ్ నోట్‌లో రాసి ఇంటి పక్కన ఉన్న వారికి శ్రీకాళహస్తి వెళ్తున్నామని ఈ నెల 15న ఇంటి నుంచి బయలు దేరారు.

మెదక్ జిల్లా నారాయణ ఖేడ్‌కు చెందిన ఎస్. బిమయ్య(50) గత కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి స్థిరపడ్డాడు. రాంచంద్రాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని లింగమయ్యకుంట బస్తీ సమీపంలో ఓ బట్టల దుకాణం నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ మధ్యే కొత్త ఇళ్లు పనులు ప్రారంభించాడు. ఈ క్రమంలో దుకాణంలో నష్టాలు రావడంతో పాటు ఇంటి కోసం తెచ్చిన అప్పులు విపరీతంగ పెరిగిపోవడంతో.. ఏం చేయాలో పాలుపోక భార్య నాగమణి, కొడుకు అనిల్, కోడలు హేమలత, మనుమలు ఆయుష్, ఆకాష్, కూతురు సంధ్యతో కలిసి ఇంట్లో సూసైడ్ నోట్ రాసి వెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బిమయ్య పెద్ద కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు