కలెక్టరేట్‌ పనులకు అడ్డంకి

4 Oct, 2016 19:38 IST|Sakshi
కలెక్టరేట్‌ పనులకు అడ్డంకి
  • కార్యాలయం ఖాళీ చేయని పంచాయతీరాజ్‌ 
  • మరమ్మతులకు అడ్డంకిగా మారిన వైనం 
  •  జగిత్యాల అర్బన్‌ : జిల్లాల పునర్విభజనలో భాగంగా జగిత్యాల జిల్లా దసరాకు ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు కార్యాలయాల ఏర్పాటు పనులు వేగవంతం చేశారు. జగిత్యాలలోని పంచాయతీరాజ్‌ శాఖ భవనాన్ని కలెక్టరేట్‌ కోసం, గెస్ట్‌హౌస్‌ను కలెక్టరేట్‌ సిబ్బంది కోసం కేటాయించారు. వీటి మరమ్మతులకు రూ.11 లక్షలు మంజూరు కాగా కాంట్రాక్టర్‌కు అప్పగించి పనులను మొదలుపెట్టారు. పంచాయతీరాజ్‌ శాఖ కార్యాలయం కోసం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ను అప్పగించారు. అయితే పంచాయతీరాజ్‌ అధికారులు తమ కార్యాలయాన్ని ఖాళీ చేయకపోవడంతో మరమ్మతులకు అడ్డంకిగా మారింది. పంచాయతీరాజ్‌ శాఖ భవనం జీ ప్లస్‌ వన్‌ కలిగి ఉంది. పైన కలెక్టర్‌ చాంబర్‌తో పాటు కాన్ఫరెన్స్‌హాల్, ఇతర సిబ్బందికి కేటాయించారు. ఈ పనులన్నీ వేగవంతంగా చేస్తున్నారు. కలెక్టర్‌ చాంబర్‌ కోసం నూతన కిటికీలు, తలుపులు ఏర్పాటు చే స్తున్నారు. పైన చకచకా పనులు జరుగుతున్నప్పటికీ... కింది ఫ్లోర్‌లో ఉన్న పంచాయతీరాజ్‌ శాఖ కార్యాలయం ఖాళీ చేయలేదు. ఆ శాఖ అధికారులు మాత్రం తమకు షిఫ్టింగ్‌ ఆర్డర్స్‌ రాలేదని, ఆర్డర్స్‌ వస్తేనే ఖాళీ చేస్తామని పేర్కొంటున్నారు. ఇంతవరకు కలెక్టరేట్‌ కార్యాలయం నుంచి షిఫ్టింగ్‌కు సంబంధించి నోటీసులు రాలేదని తెలిసింది. దీంతో ప్రహారీతోపాటు గేట్లు తదితర మరమ్మతులు చేపడుతున్నారు. గోడలకు రంగులు వేస్తున్నారు. సోమవారం సబ్‌కలెక్టర్‌ శశాంక పంచాయతీరాజ్‌ శాఖ అధికారులను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించినా స్పందన కనిపించలేదు. దసరాకు ఇంకా ఐదు రోజులు రోజుల సమయమే ఉంది. ఒకవైపు గడువు ముంచుకొస్తుంటే మరమ్మతులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఎలాంటి మరమ్మతులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పంచాయతీరాజ్‌ ఈఈ చాంబర్‌ను డీఆర్‌వోకు కేటాయించనున్నట్లు తెలిసింది. మిగతా గదులను కలెక్టరేట్‌ సిబ్బంది కోసం కేటాయించనున్నారు. 
    అన్ని శాఖలు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లోనే.. 
    మరోవైపు పంచాయతీరాజ్‌ శాఖ కార్యాలయానికి కేటాయించిన ఆర్‌అంబీ గెస్ట్‌హౌస్‌లోనే డిస్ట్రిక్ట్‌ మెడికల్‌ హెల్త్, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్, ఫ్యామిలీ వెల్ఫేర్, ఆయూష్, పబ్లిక్‌ హెల్త్, ఏడీ గ్రౌండ్‌వాటర్, ఏడీ ఇండస్ట్రీస్, ఏడీ మైన్స్‌ అండ్‌ జియోలజీ, ఎస్‌ఈ రూరల్‌ వాటర్‌ సపై ్ల కార్యాలయాలకు సైతం కేటాయించారు. ఇటీవల ఏడీ గ్రౌండ్‌వాటర్‌ శాఖ వారు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు తాళం వేసుకుని వచ్చారు. ఇన్ని శాఖలు ఇందులోనే ఉండటంతో ఈ కార్యాలయం మాదంటే మాదని లొల్లి జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే పంచాయతీరాజ్‌ అధికారులు అక్కడికి షిఫ్ట్‌ కావడం లేదని తెలిసింది. 
     
     
>
మరిన్ని వార్తలు