డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

28 Sep, 2016 23:48 IST|Sakshi
  • కళాశాల యాజమాన్యం వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల ఆందోళన
  • మృతదేహం వద్ద సూసైడ్‌ నోట్‌
  •  
    ఖమ్మంక్రైం : ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని తాను ఉంటున్న హాస్టల్‌లోనే ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం సృష్టించిం ది. కళాశాల నిర్వాహకుల వేధింపులతో విద్యార్థిని మృతి చెందిందని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కురవి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పగడాల భవాని(19) నెహ్రూ నగర్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కళాశాలకు సంబంధించిన హాస్టల్‌లోనే ఉంటోం ది. ఈ క్రమంలో బుధవారం కళాశాలలో రెండు పిరి యడ్ల తర్వాత ఇంటర్వెల్‌ సమయంలో తాను ఉంటున్న హాస్టల్‌ గదికి వచ్చింది. ఆ సమయంలో హాస్టల్‌లో స్వీపర్‌ మాత్రమే ఉంది. హాస్టల్‌ గదికి వెళ్లిన భవాని ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో స్వీపర్‌ ఆమె ఉంటున్న గది వద్దకు వెళ్లి చూడగా.. తలుపులు వేసి ఉన్నాయి. కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. వెంటనే స్వీపర్‌ కేకలు వేస్తూ కళాశాల సిబ్బందిని పిలవడంతో వారు హుటాహుటిన వచ్చి తలుపులు నెట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే భవాని మృతిచెందింది. దీంతో కళాశాల సిబ్బంది టూటౌన్‌ పోలీసులకు సమాచారమివ్వగా సీఐ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై ఓంకార్‌యాదవ్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు మార్చురీ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. తమ కుమార్తె కళాశాల సిబ్బంది వేధింపుల వల్లనే చనిపోయిందని, కావాలనే లేఖను పక్కన పెట్టారని, మృతదేహాన్ని వెంటనే తరలించడం ఏమిటని ఆందోళన చేశారు. భవాని కుటుంబానికి న్యాయం చేసి కళాశాలపై చర్య తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కళాశాల, మార్చురీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. అనంతరం భవాని మృతిపై విచారణ చేస్తామని కుటుంబ సభ్యులకు పోలీసులు సర్దిచెప్పడంతో వారు శాంతించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మార్చురీ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహిళా పోలీస్‌స్టేన్న్‌ సీఐ వెంకన్న ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.   
మరిన్ని వార్తలు