రుణాల కల్పనలో జిల్లా మొదటిస్థానంలో ఉండాలి

29 Mar, 2017 00:15 IST|Sakshi
రుణాల కల్పనలో జిల్లా మొదటిస్థానంలో ఉండాలి
జిల్లాస్థాయి బ్యాంకర్ల సలహా సంప్రదింపుల కమిటీ సమావేశంలో కలెక్టర్‌
రూ.19770.21 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక విడుదల
కాకినాడ సిటీ : లక్ష్యాల మేరకు లబ్ధిదారులకు నూరుశాతం రుణాలు అందించి జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషిచేయాలని కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ బ్యాంకర్లను కోరారు. మంగళవారం కలెక్టరేట్‌ కోర్టు హాలులో జిల్లాస్థాయి బ్యాంకర్ల సలహా సంప్రదింపుల కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రూ.19770.21 కోట్లతో రూపొందించిన 2017–18 వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రంగాల ద్వారా ప్రభుత్వ పథకాలకు రుణాల మంజూరుకు బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు. పంట రుణాల కోసం రూ.7380.07 కోట్లు కేటాయించగా వ్యవసాయ, వ్యవసాయానుబంధ రంగాలు అయిన పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, పట్టు పరిశ్రమ, అగ్రి ఇన్‌ ప్రాస్ట్రక్చర్, గొర్రెలు, మేకలు పెంపకం తదితర రంగాలకు కలిపి రూ.3641.13కోట్లు కేటాయించారన్నారు. ఇతర ప్రాధాన్య రంగాలకు రూ.2058.99కోట్లు కేటాయించగా విద్యారంగానికి సుమారు రూ.200కోట్లు కాగా గృహ రుణాల కోసం రూ.707కోట్లు, ఎక్స్‌పార్టు క్రేడిట్‌ కోసం రూ.347కోట్లు కేటాయించినట్టు తెలిపారు. పరిశ్రమల రంగాన్ని ప్రోత్సహించడానికి ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌ రూ.2వేల 664కోట్లు మహిళా సంఘాల రుణాల కోసం రూ.1200 కోట్లు కేటాయించారన్నారు. జిల్లా నాబార్డు రూపొందించిన పీఎల్‌పీ 2017–18 ప్రాతిపదికగా వార్షిక రుణ ప్రణాళిక కేటాయింపులు జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ ఎస్‌.సత్యనారాయణ, జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి, స్టేట్‌బ్యాంకు ఏజీఎం సాయిబాబు, ఎల్‌డీఎం సుబ్రహ్మణ్యం, నాబార్డు ఏజీఎం కేవీఎస్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు. 
ఎన్‌హెచ్‌-216 పనులు త్వరగా పూర్తి చేయాలి
జాతీయ రహదారి 216 విస్తర్ణకు సంబంధించి పనులను అధికారులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. నష్టపరిహారంపై రైతుల నుంచి అభ్యంతరాలు వస్తే వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. పనసపాడు, చేబ్రోలు గ్రామాల్లో రోడ్డు విస్తరణలో ఉన్న దేవాదాయ భూములకు ప్రత్యామ్నయ భూములు గుర్తించి వారికి అప్పగించాలని సూచించారు. చిత్రాడలో మార్కింగ్‌ దాటి కట్టడాలు కూల్చివేస్తున్నారనే అభియోగాలు ఉన్నాయని, లబ్ధిదారుల ఫిర్యాదుల మేరకు సర్వే చేసి ఎంత భూమి తీసుకుంటున్నామో నిర్ధారించి చెప్పాలన్నారు. విస్తరణలో నష్టపోయిన కట్టడాల విలువ 3వ పార్టీ ద్వారా మదించి చెల్లింపులకు చర్యలు చేపట్టాలని నేషనల్‌ హైవే అధికారులను ఆదేశించారు. 
ఏప్రిల్‌ 3న ఐడియాలజీ రన్‌
డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ 125వ జయంతి ముగింపు ఉత్సవాలను పురస్కరించుకొని ఏప్రిల్‌ 3న ఐడియాలజీ రన్‌ నిర్వహించాలని, అందుకు యువతను సమీకరించాలని సోషల్‌ వెల్ఫేర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఏప్రిల్‌ 14న నిర్వహించే ముగింపు ఉత్సవాలకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. సమావేశంలో సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ శోభారాణి, సెట్రాజ్‌ సీఈవో శ్రీనివాసరావు, రెడ్‌క్రాస్‌ కార్యదర్శి వైడీ రామారావు పాల్గొన్నారు.
>
మరిన్ని వార్తలు