సాక్షి, బెంగళూరు: కర్నూలు జిల్లాకు చెందిన మహిళపై అత్యాచారానికి యత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంఖ్యాశాస్త్ర (న్యూమరాలజిస్టు) గురూజీ ఆర్యవర్ధన్ను శుక్రవారం రాత్రి నగరంలోని రాజరాజేశ్వరి నగర్ పోలీసులు పుదిచ్చేరిలో అరెస్ట్ చేశారు. వివరాలు...నగరంలోని రాజరాజేశ్వరి నగర్కు చెందిన సంఖ్యాశాస్త్ర గురూజీ ఇటీవల సంఖ్యాశాస్త్రానికి సంబంధించి శిక్షణ ఇస్తామని పత్రికల్లో ప్రకటనలిచ్చాడు. ఇది చూసిన కర్నూలుకు చెందిన ఓ యువతి న్యూమరాలజీలో శిక్షణ తీసుకోవడానికి కొద్ది నెలల క్రితం రాజరాజేశ్వరినగర్లోని ఆర్యవర్ధన్ ఇంటికి చేరుకుంది. కొద్ది రోజుల అనంతరం ఆర్యవర్ధన్ గురూజీ .. యువతితో అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తప్పని యువతి ఎన్నిసార్లు వారించినా పెడచెవిన పెట్టిన గురూజీ ఆగస్ట్ 21న ఆమెపై బలవంతంగా అత్యాచారానికి యత్నించాడు. అక్కడి నుంచి కష్టం మీద తప్పించుకొని ఆమె తన స్వస్థలానికి చేరుకుంది. అయినా వదలని గురూజీ జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో కొద్ది రోజులు పాటు ఎవరికీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. స్నేహితులు, బంధువుల సహకారంతో డిసెంబర్ 10న గురూజీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న గురూజీ కోసం రెండు బృందాలుగా విడిపోయిన పోలీసులు తమిళనాడు రాష్ట్రంలోని పాండిచ్చేరిలో ఉన్నట్లు పసిగట్టాయి. దీంతో పుదిచ్చేరికి చేరుకున్న రాజరాజేశ్వరి నగర్ పోలీసులు శుక్రవారం రాత్రి గురూజీని అరెస్ట్ చేసి శనివారం నగరానికి తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు.