చంద్రబాబుపై ఫిర్యాదులు

9 Feb, 2016 12:28 IST|Sakshi
చంద్రబాబుపై ఫిర్యాదులు

విశాఖపట్నం/ఆచంట: ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చందబాబు నాయుడు చేసిన కుల వివక్షపూరిత వ్యాఖ్యలపై దళిత వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దళితుల ఓట్లతో గెలిచి దళితులను కించపరుస్తారా అంటూ వైఎస్‌ఆర్‌సీపీ ఎస్సీ ఎస్టీ సెల్ రాష్ట్ర నేత మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం విశాఖపట్నం జగదాంబ జంక్షన్‌లో విలేకరులతో మాట్లాడుతూ దళితులను కించపరిచే విధంగా మాట్లాడిన చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వివాదస్పద వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై పశ్చిమగోదావరి జిల్లాలో కేసులు పెట్టారు. ఆచంట పోలీస్ స్టేషన్‌లో వైఎస్‌ఆర్‌సీపీ నేత సుంకర సీతారాం ఫిర్యాదు చేశారు. దళితులను కించపరిచిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. చంద్రబాబుపై వైఎస్సార్సీపీ దళిత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మార్పీఎస్ నాయకుడు విజయరావు మంగళవారం కొవ్వూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్సీల మనో భావాలను దెబ్బతీసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
 

మరో వైపు చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం ఎమ్మార్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కూడా ముఖ్యమంత్రి పై ఎస్సీ అట్రాసీటీ కేసు నమోదైంది. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాములు ఫిర్యాదు మేరకు సీఐ మధు మంగళవారం కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి ఎస్సీలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సీడీని ఫిర్యాదుతో జత చేశారు.
 

>
మరిన్ని వార్తలు