గోపవరం(మహానంది): భర్తతో పాటు అత్త,మామల వేధింపులు తాళలేక ఓ వివాహిత కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మహానంది మండలం గోపవరం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. మహానంది ఎస్ఐ జి.పెద్దయ్యనాయుడు తెలిపిన వివరాల మేరకు... వెల్దుర్తికి చెందిన అనూష(20)కు గోపవరం గ్రామానికి చెందిన టి.వెంకటేశ్వర్లుతో రెండేళ్ల క్రితం వివాహమైంది. కొద్ది రోజుల నుంచి భర్త వెంకటేశ్వర్లు మానసిక, శారీరక వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టాడు. అత్త, మామలు రాయుడు, వెంకటమ్మలు వరకట్నం తీసుకోరావాలని వేధించేవారు. దీంతో వారి వేధింపులు తాళలేక అనూష సోమవారం కిరోసిన పోసుకుని నిప్పంటించుకుంది. కుటుంబసభ్యులు గమనించి చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందింది. తన బిడ్డ చావుకు ఆమె భర్త, అత్త మామలే కారణమని మృతురాలి తల్లి జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.