విటమిన్‌ డీ లోపంతో మధుమేహం ముప్పు...

21 Apr, 2018 00:17 IST|Sakshi

సూర్యుడి లేలేత కిరణాల నుంచి మాత్రమే మన శరీరం తయారుచేసుకోగల విటమిన్‌ –డి∙తగ్గితే మధుమేహం వచ్చే ముప్పు ఎక్కువ అవుతుందని హెచ్చరిస్తున్నారు సియోల్‌ నేషనల్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. మధుమేహ లక్షణాలు ఏ కొంచెం కూడా లేని కొంతమందిపై వీరు దాదాపు పదేళ్లపాటు అధ్యయనం జరిపారు. అధ్యయనంలో పాల్గొన్న వారి రక్తంలో విటమిన్‌ – డి మోతాదులను తరచూ పరిశీలించడంతోపాటు, నిరాహారంగా ఉన్నప్పుడు రక్తంలో చక్కెర శాతాన్నీ లెక్కకట్టారు.

పరిశోధన కోసం విటమిన్‌ – డి మోతాదు ప్రతి మిల్లీలీటర్‌ రక్తపు ప్లాస్మాలో 30 నానోగ్రాములు కనిష్ఠంగా ఉండాలని అనుకున్నారు.  పదేళ్ల కాలంలో 47 మందికి మధుమేహం సోకగా.. 337 మందికి ప్రీడయాబెటిస్‌ ఉన్నట్లు స్పష్టమైంది. విటమిన్‌ – డి∙మోతాదులతో పోల్చి చూసినప్పుడు 30 నానోగ్రాములున్న వారు మధుమేహం బారినపడే అవకాశం 33 శాతం వరకూ ఉండగా.. 50 నానోగ్రాములు ఉన్నవారికి ఇది 20 శాతం మాత్రమే ఉంది. మధుమేహుల్లో చాలామంది విటమిన్‌ – డి లోపంతో బాధపడుతూండటం ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారని, దీన్నిబట్టి ఈ రెండింటికీ మధ్య సంబంధం ఉన్నట్లు స్పష్టమవుతోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సూ పార్క్‌ అంటున్నారు. 

మరిన్ని వార్తలు