యూనియన్‌ బ్యాంకుకు రూ.314 కోట్ల కుచ్చుటోపీ!

19 May, 2018 01:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పలు బ్యాంకుల నుంచి కంపెనీ కోసం రుణాలు తీసుకుని ఇతర పనులకు నిధులు మళ్లించిన తొట్టెం ఇన్‌ఫ్రా కంపెనీపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లోని సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు 14వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిట్‌ మేజి   స్ట్రేట్‌ కోర్టులో చార్జిషీటు దాఖలైంది. పలు అంతర్జాతీయ ఇన్‌ఫ్రా కంపెనీలకు తొట్టెం ఇన్‌ఫ్రా కంపెనీ సబ్‌కాంట్రాక్టర్‌గా పనులు చేస్తోంది.

8 బ్యాంకులతో కూడిన కన్సార్టియం నుంచి రూ.1,394 కోట్లను రుణంగా తీసుకుని చెల్లించలేకపోయింది. రూ.314 కోట్ల రుణాన్ని 2012లో నిరర్ధక ఆస్తిగా ప్రకటించిన యూనియన్‌ బ్యాంకు.. సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ.. నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో తొట్టెం కంపెనీ రుణాలు పొందినట్లు గుర్తించింది.

దీంతో ఆ కంపెనీ డైరెక్టర్లు తొట్టెంపూడి సలలిత్, తొట్టెంపూడి కవితలను అరెస్ట్‌ చేసింది. ఇన్‌ఫ్రా పనుల కోసం తీసుకున్న రుణాలను ఇతర పనులు, వ్యక్తిగత అవసరాల కోసం వాటిని మళ్లించిందని చార్జిషీటులో సీబీఐ పేర్కొంది. కుట్ర పూరితంగా బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టేందుకు కొంతమంది అధికారులతో కలసి ఆ కంపెనీ యాజమాన్యం యత్నించినట్టు ఆరోపించింది.  

మరిన్ని వార్తలు