కోడెల, సీబీఐ, గుంటూరు ఎస్పీలకు హైకోర్టు నోటీసులు

30 Aug, 2016 01:10 IST|Sakshi

కోడెల శివరామకృష్ణ, స్థానిక పోలీసులకు కూడా..
 
 సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా, నరసరావుపేటలో వైఎస్సార్‌సీపీ యువనేత నల్లపాటి రామచంద్రప్రసాద్ నిర్వహిస్తున్న నల్లపాటి కేబుల్ విజన్(ఎన్‌సీవీ) కార్యాలయంపై టీడీపీ వర్గీయులు దాడి చేసి ధ్వంసం చేసిన ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది.దీనిపై వివరణ ఇవ్వాలంటూ సత్తెనపల్లి ఎమ్మెల్యే, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు, ఏకే కమ్యూనికేషన్స్ ఎండీ కోడెల శివరామకృష్ణ, గుంటూరు ఎస్పీ నారాయణనాయక్, పోలీసులు నాగేశ్వరరావు, వీరయ్య చౌదరి, సాంబశివరావు, బి.ప్రభాకర్, టి.వి.శ్రీనివాసరావు, సురేంద్రబాబు, లోకనాథం తదితరులకు నోటీసులిచ్చింది.

అలాగే సీబీఐ డెరైక్టర్ జనరల్‌తో పాటు బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, ఐడియా, యునినార్, వొడాఫోన్ సంస్థల ప్రతినిధులకూ నోటీసులిచ్చింది. కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు కలసి పోలీసులకు ఫోన్లు చేసి మొత్తం కథ నడిపారంటూ పిటిషనర్ ఆరోపిస్తున్న నేపథ్యంలో గత నెల 10, 11 తేదీల్లో స్థానిక పోలీసుల కాల్ డేటా మొత్తాన్ని భద్రపరచాలని బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, ఐడియా తదితర సర్వీస్ ప్రొవైడర్లను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సోమవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

మరిన్ని వార్తలు