ఉత్తర కొరియాపై ట్రంప్‌ ట్రావెల్‌ బ్యాన్‌

25 Sep, 2017 08:12 IST|Sakshi

సాక్షి, వాషింగ్టన్‌ : ఉత్తర కొరియాపై ట్రావెల్‌ బ్యాన్‌ విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించేసింది. ఆదివారం జారీ చేసిన తాజా ఉత్తర్వుల్లో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉ.కొ. తోపాటు వెనిజులా, ఛాద్‌ దేశాలకు కూడా ప్రయాణ నిషేధ ఉత్తర్వులు వర్తిస్తాయని వైట్‌హౌజ్‌ ఓ ప్రకటనలో తెలియజేసింది. 

సిరియా, ఇరాక్, లిబియా, ఇరాన్, సోమా లియా, సూడాన్, యెమెన్‌ పౌరులపై 90 రోజుల పాటు నిషేధం విధిస్తూ జనవరిలో ట్రంప్‌ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. తాజా ఉత్తర్వుల్లో సుడాన్‌ పై నిషేధాజ్ఞలు ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించారు. ‘అమెరికా రక్షణే నా ప్రథమ కర్తవ్యం. ఆయా దేశాల నుంచి ముప్పు ఉంది కాబట్టే వారిని అమెరికాలోకి అనుమతించటం లేదు’ అని ఆదేశాలు వెలువడిన కాసేపటికే ట్రంప్‌ తన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. 

మార్చి నుంచి అమలులోకి వచ్చిన ట్రావెల్‌ బ్యాన్‌ పై గడువు ఆదివారంతో ముగియటంతో సంబంధిత దేశాల ప్రజల్ని అమెరికాకు అనుమతిస్తారా? లేదా? అన్న విషయంపై తొలుత సందిగ్ధత నెలకొంది. అయితే అమెరికా సుప్రీం కోర్టు ఈ నిషేధంపై విచారణ జరిపేవరకు ప్రయాణ నిషేధాన్ని పొడిగించాలని ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయించుకుంది.

మరిన్ని వార్తలు