అదొక భయానక దృశ్యం!

24 Jul, 2019 16:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలోని ‘ఎల్లోస్టోన్‌ నేషనల్‌ స్టోన్‌ పార్క్‌’లో సోమవారం చోటుచేసుకున్న భయానక దశ్యం ఇదీ. ఫ్లోరిడాలోని ఒడిస్సా ప్రాంతానికి చెందిన యాభై మంది సందర్శకులు ఆ రోజు నేషనల్‌ పార్క్‌లో సంచరిస్తూ అమెరికా అడవి దున్నగా పిలిచే (బైసన్‌) సమీపంలోకి వెళ్లారు. వారు దాదాపు 20 నిమిషాల సేపు అక్కడే గడిపారు. అనూహ్యంగా ఓ అడవిదున్న మిగతా వారికి కొంచెం ఎడంగా ఉన్న ముగ్గురు పిల్లల మీదకు దూసుకెళ్లింది. దాని దాడి నుంచి ఇద్దరు పిల్లలు తప్పించుకోగా, ఓ తొమ్మిదేళ్ల బాలకను అది కొమ్ములతోనే ఆకాశంలోకి గిరాటేసింది. ఆ దశ్యాన్ని చూసిన సందర్శకులు భయభ్రాంతులతో తలోదిక్కుకు పరుగులు తీశారు.


తీవ్రంగా దెబ్బతగిలిన ఆ బాలికను ‘ఓల్డ్‌ ఫేత్‌ఫుల్‌ క్లినిక్‌’కు కుటుంబ సభ్యులు తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఆ అమ్మాయికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిసింది. అయితే ఆ కుటుంబ సభ్యులు నేషనల్‌ పార్క్‌ సిబ్బందిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ పార్క్‌ అధికారులు సంఘటనకు సంబంధించి సందర్శకులు తీసిన ఓ వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు ఆ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతోంది. 2018లో ఓ అమ్మాయిని కూడా ఓ అడవిదున్న ఇలాగే కుమ్మేసింది. ఆ తర్వాత అలాంటి సంఘటన జరగడం ఇదేనని పార్క్‌ సిబ్బంది తెలిపారు. ఈపార్క్‌లో అమెరికా జాతికి చెందిన అడవి దున్నలు 4,527 ఉన్నాయి. వాటిలో మగ దున్నలు దాదాపు 920 కిలోల బరువుంటే, అడ దున్నలు దాదాపు 500 కిలోల బరువు ఉంటాయని సిబ్బంది తెలిపారు. 

మరిన్ని వార్తలు