చైనీయులకు తిరుగులేదన్నారు ఇందుకే..!

23 Jan, 2018 15:40 IST|Sakshi
హైస్పీడ్‌ రైలు ట్రాక్‌ను నిర్మిస్తున్న చైనీయులు

9 గంటల్లో హైస్పీడ్‌ ట్రైన్‌ ట్రాక్‌ను నిర్మించిన చైనా వర్కర్లు

ట్రాఫిక్‌ లైట్స్‌, ట్రాఫిక్‌ మానిటరింగ్‌ వ్యవస్థనూ అమర్చారు

భారీ ప్రాజెక్టులో పాలు పంచుకున్న ఏడు రైళ్లు, 1,500 మంది వర్కర్లు

లొంగ్యాన్‌, చైనా : అతికొద్ది సమయంలో భారీ ప్రాజెక్టులను పూర్తి చేయగల సత్తా తమ సొంతమని చైనీయులు ప్రపంచానికి మరోసారి చాటి చెప్పారు. కేవలం తొమ్మిది గంటల్లో కొత్త రైల్వే స్టేషన్‌కు హై స్పీడ్‌ రైలు ట్రాక్‌(గంటకు 200 కి.మీ వేగం)ను నిర్మించి రికార్డు సృష్టించారు.

రైల్వే ట్రాక్‌ నిర్మాణంలో 1,500 మంది వర్కర్లు పాల్గొన్నారు. వీరికి అవసరమైన వస్తువులను సరఫరా చేసేందుకు ఏడు రైళ్లను వినియోగించారు. దక్షిణ చైనాలోని ఫుజియన్‌ ప్రావిన్సులో గల లొంగ్యాన్‌ పట్టణంలోని రైల్వే స్టేషన్‌కు హైస్పీడ్‌ సర్వీసులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కొత్త రైల్వే స్టేషన్‌ను నిర్మించారు.

స్టేషన్‌కు హైస్పీడ్‌ రైల్వే ట్రాక్‌ను యుద్ధప్రాతిపదికన నిర్మించాలని ఆదేశాలు జారీ కావడంతో కేవలం తొమ్మిది గంటల్లో నిర్మించి రికార్డు సృష్టించారు. కొత్తగా నిర్మించిన ‘నాన్‌లాంగ్‌ రైల్వే లైను’ను మరో మూడు లైన్లకు అనుసంధానించడంతో టాస్క్‌ పూర్తైంది. అంతేకాకుండా స్టేషన్‌కు రైళ్ల సమాచారాన్ని చేరవేసే ట్రాఫిక్‌ మానిటరింగ్‌ సిస్టంను సైతం అమర్చారు.

2018 చివర కల్లా 246 కిలోమీటర్ల మేర నాన్‌లాంగ్‌ రైల్వే లైనును విస్తరించాలని చైనా యోచిస్తోంది. ఇది పూర్తైతే ఈశాన్య చైనా నుంచి సెంట్రల్‌ చైనాకు ప్రయాణం సులభతరమవుతుంది.

మరిన్ని వార్తలు