ఆయుధాల ఫ్యాక్టరీగా ‘హాంకాంగ్‌ వర్శిటీ’

14 Nov, 2019 19:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హాంకాంగ్‌కు మరింత స్వాతంత్య్రం కావాలంటూ వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న యూనివర్శిటీ విద్యార్థులు రోజురోజుకు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. పాత కాలం నాటి యుద్ధ విద్యలను అవలంబిస్తూ చైనా పోలీసులను వణికిస్తున్నారు. విల్లంభులతోపాటు రాళ్లు విసిరే పంగ కర్రల (ఒడిసెల) తోని పెట్రోలు బాంబులు విసురుతున్నారు. నిఘా టవర్లను నిర్మిస్తున్నారు. ‘చైనా యూనివర్శిటీ ఆఫ్‌ హాంకాంగ్‌’ ప్రాంగణమే ఇప్పుడు ఓ యుద్ధ ప్యాక్టరీగా తయారయింది. బుధవారం ఒక్క రోజే యూనివర్శిటీ విద్యార్థులు చైనా సైనికులపైకి 400 పెట్రోలు బాంబులను విసిరారు. స్థానికులు విద్యార్థులకు గ్లాస్‌ బాటిళ్లు, హాల్కహాల్, పెట్రోలు సహాయం చేస్తున్నారు.

హాంకాంగ్‌లో నేరం చేసిన వారిని చైనాకు అప్పగించాలనే బిల్లును చైనా ప్రభుత్వం ప్రతిపాదించడంతో ఒక్కసారిగా హాంకాంగ్‌ విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయం తెల్సిందే. చివరకు విద్యార్థుల ఆందళనకు తలొగ్గి ఆ బిల్లును  చైనా ప్రభుత్వం  ఉపసంహరించుకున్నప్పటికీ విద్యార్థులు తమ ఆందోళనను వీడకుండా హాంకాంగ్‌కు పూర్తి ప్రజాస్వామ్యం కావాలంటూ తీవ్రతరం చేశారు. ఇప్పటి వరకు అరెస్ట్‌ చేసిన విద్యార్థులందరిని బేషరతుగా విడుదల చేయాలని, విద్యార్థుల ఆందోళనను అల్లర్లుగా పేర్కొనడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగుతోందని హెచ్చరించారు. 

>
మరిన్ని వార్తలు