హౌడీ మోదీకి వర్షం ముప్పు?

21 Sep, 2019 01:46 IST|Sakshi
టెక్సాస్‌లో రోడ్డుపైకి భారీగా చేరిన వరదతో ఇబ్బందులు పడుతున్న స్థానికుడు

అమెరికాలో సభ జరగనున్న రాష్ట్రంలో భారీ వర్షాలు

50 వేల మంది హాజరుపై సందేహాలు

హ్యూస్టన్‌/వాషింగ్టన్‌: అమెరికాలో ప్రతిష్టాత్మకం గా నిర్వహించతలపెట్టిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే హ్యూస్టన్‌ నగరం వరద గుప్పిట్లో చిక్కుకుంది.  టెక్సాస్‌ రాష్ట గవర్నర్‌ గ్రెగ్‌ అబ్బాట్‌ 13 కౌంటీలలో అత్యవసర పరిస్థితి విధించారు. దక్షిణ టెక్సాస్‌లో పరిస్థితి మరింత క్లిష్టంగా ఉండటంతో ప్రజలు బయటికి రావొద్దని హెచ్చరికలు జారీచేశారు. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హాజరయ్యే ఈ కార్యక్రమంపై భారీ అంచనాలున్నాయి.

50 వేల మందికి పైగా ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఒక ప్రైవేటు సంస్థ నిర్వహించే కార్యక్రమానికి ట్రంప్‌ రావడానికి అంగీకరించడంతో దీనిపై అంచనాలు పెరిగిపోయాయి. హౌడీ మోదీ కార్యక్రమం జరిగే ఎంజీఆర్‌ స్టేడియం కూడా వాన నీటితో నిండిపోయింది. దాదాపు 1,500 మంది వలంటీర్లు ఈ సభ ఏర్పాట్లలో నిమగ్నమైఉన్నారు. ఈ నెల 23న సదస్సు ఉండడంతో అప్పటి వరకు పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని నిర్వాహకులు అంటున్నారు.

మంగోలియా, భారత్‌  బంధానికి నిదర్శనం
ప్రధాని మోదీ, మంగోలియా అధ్యక్షుడు ఖాల్ట్‌మాగ్గిన్‌ బట్టుల్గా ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగోలియా రాజధాని ఉలాన్‌బాటర్‌లోని గందన్‌ బౌద్ధారామంలో గౌతమబుద్ధుడి విగ్రహాన్ని మంత్రోచ్ఛరణల నడుమ ఇరువురు నేతలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆవిష్కరించారు.

ఖరీదైన కార్యక్రమం
హౌడీ మోదీపై రాహుల్‌ వ్యాఖ్య
‘రూ. 1.4 లక్షల కోట్ల ఖర్చుతో హౌడీ మోదీ కార్యక్రమమా?.. ప్రపంచంలోనే ఇది అత్యంత ఖరీదైన ఉత్సవం అనుకుంటా. అయితే ఇలాంటి ఏ కార్యక్రమం కూడా దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత దురవస్థను దాచలేదు’ అని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శుక్రవారం ట్వీట్‌ చేశారు. కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపుతో ప్రభుత్వం కోల్పోతున్న రూ.1.4లక్షల కోట్ల ఆదాయాన్ని రాహుల్‌ వ్యంగ్యంగా ఇలా ప్రస్తావించారు.

మరిన్ని వార్తలు