తిమింగలాలను తినేస్తున్నారు..!

27 Sep, 2017 07:06 IST|Sakshi

టోక్యో : ఓ వైపు జీవవైవిధ్యం, సమతుల్యతను కాపాడాలంటూ ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు నెత్తీ నోరు బాదుకుంటుంటే జపాన్‌ మాత్రం ఆ మాటలను చెవికెక్కించుకోవడం లేదు. ఈ ఏడాది తాము ఏకంగా 177 తిమింగలాలను వేటాడినట్లు మంగళవారం ప్రకటించింది.

ఈ ప్రకటనపై పర్యావరణవేత్తలు, జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. తిమింగళాల పరిరక్షణకు ఉద్దేశించిన ‘అంతర్జాతీయ వేలింగ్‌ కమిషన్‌’ మారటోరియంపై సంతకం చేసి ఇలాంటి చర్యలకు దిగడంపై జపాన్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాస్త్రీయ పరిశోధనల పేరిట అవసరమున్నదాని కంటే ఎక్కువ తిమింగళాలను జపాన్‌ వేటాడుతోంది. జపాన్‌లో తిమింగలాల మాంసం తినేవారి సంఖ్య ఏటా తగ్గుతోన్నా.. భారీస్థాయిలో ఎందుకు వేటాడుతుందో అంతుబట్టడం లేదు.

2014లో అంతర్జాతీయ న్యాయస్థానం ఆగ్రహించడంతో 2014–15లో అంటార్కిటికా జలాల్లో వేటను నిషేధించిన జపాన్‌ ఏడాది తరువాత నుంచి తిరిగి కొనసాగిస్తోంది. మరోవైపు జపాన్‌తో పాటు నార్వే, ఐస్‌లాండ్‌ దేశాలు కూడా ఒప్పందానికి కట్టుబడకుండా తిమింగలాలను యధేచ్ఛగా వేటాడుతూ, జంతుహక్కులకు తూట్లు పొడుస్తున్నాయి.

మరిన్ని వార్తలు