చనిపోయిన భార్య టీవీలో ప్రత్యక్షం!

12 Mar, 2016 15:56 IST|Sakshi
చనిపోయిన భార్య టీవీలో ప్రత్యక్షం!

మొరాకో: కారు ప్రమాదంలో చనిపోయిన భార్య హఠాత్తుగా టీవీలో కనిపించి భర్తకి షాక్ ఇచ్చింది.  భర్త ఆచూకీ కోసం వెతుకుతూ ఓ టీవీ షోలో దర్శనమివ్వడం అతనికి ఆనందాన్ని పంచింది.  మొరాకో దేశంలోని  అజిలాల్ ప్రాంతంలో నివసించే అబ్రగ్ మొహమ్మద్ కి ఈ వింత అనుభవం ఎదురైంది.

వివరాల్లోకి వెళితే..  రెండేళ్ల క్రితం అంటే 2014 లో  భార్య రోడ్డు ప్రమాదానికి గురైందనీ, బతికే అవకాశాలు తక్కువంటూ మొహమ్మద్ కి  సమాచారం అందింది. ఆందోళనతో ఆసుపత్రి వెళ్లిన అతనికి  తీవ్ర గాయాలతో చనిపోయిందంటూ భార్య  మృతదేహాన్ని  అప్పగించారు వైద్యులు. యాక్సిడెంట్ లో గుర్తు పట్టలేనంతగా దెబ్బలు తగలడంతో ఆ మృతదేహాన్ని తన భార్యదిగానే భావించి అంత్యక్రియలు నిర్వహించాడు. దీంతో పాటుగా ఆసుపత్రి బిల్లు కూడా చెల్లించాడు. అలా  రెండేళ్లు గడిచిపోయాయి.

ఇంతలో అకస్మాత్తుగా  స్థానిక  టీవీ  కార్యక్రమంలో భార్య ప్రత్యక్షమైంది. తప్పిపోయిన వ్యక్తుల గురించి చెప్పి.. వారిని తమ తమ బంధువుల చెంతకు చేర్చే కార్యక్రమం అది.  దీంతో ఆమె  సదరు టీవీ వాళ్లని కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. రెండేళ్ల నుంచి భర్త మహమ్మద్  ఆచూకీ దొరకడం లేదని... సాయం చేయాలని కోరింది. దీంతో ఈ  స్టోరీని వారు  టెలీకాస్ట్  చేశారు.  ఈ షో చూసిన మొహమ్మద్ స్నేహితులు  ఆ విషయాన్నిఅతడి  చెవిన వేశారు.  దీంతో ఆశ్చర్య పోవడం అతని వంతైంది.

ఇపుడు వీరిద్దరి స్టోరీ  మొరాకో సోషల్ మీడియాలో పెద్ద సంచలన వార్తగా మారింది. విభిన్న చర్చలకు దారితీసింది. అయితే వారిద్దరూ కలిశారా? లేదా? అనే విషయంలో  మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

మరిన్ని వార్తలు