డీల్‌ లేని ‘బ్రెగ్జిట్‌’ వద్దు

15 Mar, 2019 02:28 IST|Sakshi

బ్రిటన్‌ దిగువ సభలో వీగిన బిల్లు

లండన్‌: యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వెనుదిరిగే బ్రెగ్జిట్‌ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒప్పందం లేకుండానే నిష్క్రమించాలని ప్రధాని థెరిసా మే చేసిన తాజా ప్రతిపాదన దిగువ సభ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో గట్టెక్కలేకపోయింది. బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో ప్రభుత్వం 43 ఓట్ల తేడాతో ఓటమిపాలైంది. 321 మంది సభ్యులు అనుకూలంగా, 278 మంది వ్యతిరేకంగా ఓటేశారు.

దీంతో బ్రెగ్జిట్‌ ప్రక్రియకు సంబంధించి మే ప్రభుత్వం తెచ్చిన ప్రతిపాదనలు రెండుసార్లు వీగిపోయినట్లయింది.షెడ్యూల్‌ ప్రకారమైతే మార్చి 29న యురోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటికి రావాల్సి ఉంది. కానీ తాజా పరిణామం నేపథ్యంలో ఆ తేదీన ఒప్పందం లేకుండా నిష్క్రమించడం సాధ్యం కాదని ప్రభుత్వం ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.  బ్రెగ్జిట్‌ ప్రక్రియ పర్యవేక్షణను పార్లమెంట్‌కు అప్పగించాలని విపక్ష లేబర్‌ పార్టీ నాయకుడు జెరెమీ కోర్బిన్‌ డిమాండ్‌ చేశారు. సభ్యుల మధ్య రాజీకి ప్రయత్నిస్తానని చెప్పారు.

రెండో రెఫరెండానికి తిరస్కరణ
బ్రెగ్జిట్‌ కోసం రెండో రెఫరెండం నిర్వహించాలన్న ప్రతిపాదనను బ్రిటన్‌ పార్లమెంట్‌ గురువారం భారీ మెజారిటీతో తిరస్కరించింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా 334 మంది, అనుకూలంగా 85 మంది ఓటేశారు. విపక్ష లేబర్‌ పార్టీ సభ్యులు చాలా మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఒకవేళ ఈ సవరణ దిగువ సభ హౌజ్‌ ఆఫ్‌ కామన్స్‌లో గట్టెక్కినా, ప్రభుత్వం దానిని తప్పకుండా అమలుచేయాల్సిన అవసరం లేదు.

మరిన్ని వార్తలు