21న ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం!

17 May, 2014 13:17 IST|Sakshi
21న ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం!

న్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఈనెల 21న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.  ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు  సమావేశానికి పార్టీ అగ్రనేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ఆయనకు ఎల్కే అద్వానీ, రాజ్‌నాధ్‌ సింగ్‌, అరుణ్‌ జైట్లీ, సుష్మాస్వరాజ్‌, వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ తదితరులు  పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మోడీ ఎన్నికపై చర్చిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు ఎయిర్‌ పోర్ట్‌ నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయం వరకూ మోడీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆయన రాకతో కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది.  కార్యకర్తలు కార్యాలయాన్ని పూలతో అలంకరించి, పూల జల్లు కురిపించి ఘనంగా స్వాగతం పలికారు. మోడీ మోడీ అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో ప్రధాన కార్యాలయం హోరెత్తింది. అనంతరం కార్యకర్తల నుద్దేశించి మోడీ ప్రసంగించారు. బీజేపీ గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు