న్యూఢిల్లీ : కరోనాతో పోరాడి గెలిచిన ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్పూరి పోలీసు స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్ దేవేందర్కు కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్గా తేలింది. అనంతరం ఆయన భార్యకు పరీక్షలు నిర్వహించగా.. ఆమెకు కూడా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆ సమయంలో ఆమె భార్య నిండు గర్భిణి. ఈ నేపథ్యంలో భార్యాభర్తలిద్దరినీ సమీప ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో మే 8వ తేదీన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవల మహిళకు మరోసారి పరీక్షలు నిర్వహించగా కరోనా నెగెటివ్గా తేలింది. దీంతో ఐసోలేషన్ వార్డు నుంచి డిశ్చార్జ్ చేశారు. (భార్యకు విడాకులు.. గాయనితో 9 ఏళ్లుగా)
కరోనా కష్ట కాలంలో విధులు నిర్వహించినందుకు, పాప పుట్టినందుకు దేవేందర్కు పలువురు సీనియర్ పోలీసు అధికారులు గురువారం తన ఇంటికి వెళ్లి అభినందించారు. ఎన్నో కష్టతరమైన రోజులు గడిపిన అనంతరం పాప తమ జీవితంలోకి రావడం ఆనందంగా ఉందని కానిస్టేబుల్ దేవేందర్ అన్నారు. జహంగీర్లో విధులు నిర్వహిస్తున్నప్పుడు తనకు కరోనా సోకిందని, అక్కడ ఉన్న సిబ్బందిలో ఆరుగురికి సోకినట్లు దేవేందర్ తెలిపారు. తన ద్వారా భార్యకు కూడ కరోనా పాజిటివ్ తేలిందన్నారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం కుదుటపడినట్లు పేర్కొన్నారు. (ఆర్థిక ప్యాకేజీ : సీతారామన్ మూడో ప్రెస్మీట్ )