జమిలి ఎన్నికలకు రెడీ

29 Jan, 2018 19:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు అనువైన వాతావరణం ఏర్పాటుకు సిద్ధం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్‌డీఏ పక్షాలను కోరారు. భాగస్వామ్య పక్షాల నేతలతో సమావేశమైన సందర్భంగా ప్రధాని ఈ మేరకు నేతలను కోరారని ఎన్‌డీఏ వర్గాలు పేర్కొన్నాయి. భేటీ సందర్భంగా దావోస్‌ వేదికపై ప్రధాని మోదీ స్ఫూర్తివంతంగా ప్రసంగించారని కొనియాడుతూ బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ఓ తీర్మానాన్ని ఆమోదించింది.

ఇక జమిలి ఎన్నికలపై చర్చలు చేపడుతూ ఇందుకు అనువైన వాతావరణాన్ని తీసుకురావాలని ప్రధాని కోరినట్టు ఈ సమావేశానికి హాజరైన ఓ నేత వెల్లడించారు. తరచూ ఎన్నికలు ఎదురవుతుండటంతో అభివృద్ధికి ఆటంకమే కాకుండా భారీ వ్యయం వెచ్చించాల్సి వస్తోందని ఏకకాల ఎన్నికలే దీనికి పరిష్కారమని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారని ఆయన వివరించారు. పార్లమెంట్‌ సమావేశాలతో పాటు ఆయా పార్లమెంటరీ కమిటీ సమావేశాలకు సభ్యులు విధిగా హాజరుకావాలని ప్రధాని కోరారని చెప్పారు.

>
మరిన్ని వార్తలు