కశ్మీర్‌లో భయం...భయం

5 Aug, 2019 12:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌లో ఎప్పుడేమి జరుగుతుందోనన్న భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. వీధుల్లో దాదాపు 35 వేల మంది సైనికుల పద ఘట్టనలు కొనసాగుతున్నాయి. జమ్మూ కశ్మీర్‌ ప్రాంతానికి చెందిన ముగ్గురు శక్తివంతమైన నాయకులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా, సాజద్‌ లోన్‌ల అనూహ్య గృహ నిర్బంధం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. ల్యాండ్‌లైన్, మొబైల్‌ ఫోన్లు, ఇంటర్నెట్‌ సర్వీసుల నిలిపివేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి ఉన్నతాధికారులకు శాటిలైట్‌ ఫోన్లు అందుబాటులో ఉంచారు. పాఠశాలలు, కళాశాలలన్నింటినీ మూసివేశారు. హాస్టళ్లను కూడా ఖాళీ చేయాల్సిందిగా విద్యార్థులకు ఆదేశం. ప్రధాన కూడళ్లలో బారికేడ్లను  ఏర్పాటు చేయడమే కాకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అల్లర్లు జరిగితే అదుపు చేయడానికి ప్రత్యేక వాహనలు సిద్ధం చేశారు.

చదవండి : కశ్మీర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం

వీధుల్లో సభలు, సమావేశాలు, ధర్నాలను పూర్తిగా నిషేధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ, కర్ఫ్యూ విధించడం లేదని రాష్ట్ర గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ప్రకటన చేశారు. ఆయన అలాంటి ప్రకటన చేసినప్పటికీ అన్ని చోట్ల భారీ బందోబస్తుతో పాటు నిఘాను ముమ్మరం చేశారు.  శుక్రవారం నుంచే అమర్‌నాథ్‌ యాత్రికులు, పర్యాటకులను రాష్ట్రం నుంచి వెళ్లి పోవాల్సిందిగా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కశ్మీర్‌కు పదివేల కేంద్ర బలగాలను తరలిస్తూ జూలై 25వ తేదీన కేంద్ర హోం శాఖ ఆదేశాలను జారీ చేసిన నాటి నుంచే ప్రజల్లో ఏదో జరగబోతోందన్న ఆందోళన నెలకొంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఆగస్టు ఒకటవ తేదీన కశ్మీర్‌లోకి మరో పాతికవేల మంది సైనికులను తరలించారు.

చదవండిఇదొక చీకటి రోజు : ముఫ్తి 

కశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 వ అధికరణం రద్దువుతుందన్న ఒక్కసారిగా పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. నిత్యవసరాల నిల్వల కోసం  మార్కెట్లలో ప్రజల తాకిడి పెరిగింది. వంట గ్యాస్‌ కోసం జనం బారులు తీరారు. వీధుల్లో సైన్యం పహారా మొదలైంది. ఆదివారం సాయంత్రానికల్లా ఇళ్లలోకి వెళ్లాల్సిందిగా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. దాంతో రాష్ట్రమంతా పరిస్థితులు గంభీరంగా మారాయి. అనేక చోట్ల ఒకరకమైన నిశ్శబ్ధ వాతావరణ నెలకొంది. సోమవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ అత్యవసరంగా సమావేశమై 370 అధికరణ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ నిర్ణయంపై రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటన చేయడంతోనే సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రతిపక్షాల ఆందోళన, కాంగ్రెస్‌ సహా సభ నుంచి పలు పార్టీల సభ్యుల వాకౌట్‌ చేశారు. 370 అధికరణాన్ని రద్దు చేస్తూ చేసిన నిర్ణయంపై కేంద్రం ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. పలు రాజకీయ పార్టీలు ఆ నిర్ణయాన్ని సమర్థించగా, మరికొన్ని వ్యతిరేకించాయి. ఇకపోతే కశ్మీర్ లో తాజా పరిస్థితులను, పరిణామాలను కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. 

మరిన్ని వార్తలు