నిప్పులపై నడిచిన ఐజీ, మహిళా ఎస్పీ

13 Sep, 2016 19:00 IST|Sakshi
నిప్పులపై నడిచిన ఐజీ, మహిళా ఎస్పీ

రాయ్పూర్: తమ ప్రాంతంలో పెరిగిపోతున్న మూఢనమ్మకాలను నిలువరించేందుకు ఛత్తీస్గఢ్లో ఓ ఐజీ అధికారి, ఓ ఎస్పీ నడుం కట్టారు. మూఢ విశ్వాసాలను నమ్మకూడదని రుజువు చేస్తూ వారిద్దరు బూట్లు లేకుండా పాదాలతో నిప్పులపై నడిచి చూపించారు. ముంగేలి ప్రాంతంలో ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా అందరిని ఒక చోటకు పిలిచారు. అనంతరం ఓ నిప్పుల కొలిమి ఏర్పాటుచేశారు.

బిలాస్పూర్ కు చెందిన ఐజీ వివేకానంద్, ముంగేలి ఎస్పీ నీతు కమల్ ఆ నిప్పులపై చెప్పులు లేకుండా నడిచారు. చేతబడి కూడా లేదని దానికి సంబంధించిన కొన్ని ప్రయోగాలు ఎలా చేస్తారో వారికి వివరించారు. మాయాజాలంతో ప్రజలను ఎలా మోసం చేస్తారో ప్రయోగాత్మకంగా చూపించారు. పలువురు విద్యార్థులు, గ్రామస్తులతో కూడా ఆ నిప్పులపై నడిపించి తమ విశ్వాసాలు మూఢత్వంతో నిండినవని నిరూపించారు. ఇటీవల కాలంలో ముంగేలీలో ఈ తరహా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో వాటిపై అవగాహన కల్పించేందుకు ఉన్నత శ్రేణి అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.

మరిన్ని వార్తలు