దారుణం : కులానికి మచ్చ తెచ్చారని..

30 Dec, 2017 18:22 IST|Sakshi

మల్కాన్‌గిరి(భువనేశ్వర్) : ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా రెండు రోజులపాటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. క్షత్రియ కులానికి చెందిన ఓ వ్యక్తి సఫాయి పని చేసి, గ్రామానికి మచ్చ తెచ్చాడని అతడి కుటుంబాన్ని గ్రామస్తులు వెలేశారు. అంతేకాకుండా సదరు వ్యక్తి మరణించిన తర్వాత కూడా వారి కుటుంబసభ్యులను ఆ గ్రామం వెలేసింది. ఈ సంఘటన మల్కాన్ గిరి జిల్లా నువాగూడా గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. క్షత్రియ కుటుంబంలో జన్మించినా బతుకుదెరువు కోసం కమలా చితాల్(75) కుమారుడు లక్ష్మణ్‌ డ్రైనేజీ శుద్ధి చేయడం, స్మశాన వాటికలో పనిచేయడం చేశాడు. దీంతో క్షత్రియ కులాన్ని అవమాన పరిచాడంటూ గ్రామస్తులు ఆగ్రహం చెంది వారి కుటుంబాన్ని ఏడేళ్ల కిందట వెలేశారు. అయితే లక్ష్మణ్‌ కొన్నేళ్ల కిందటే మృతిచెందినా వారి కుటుంబంపై మాత్రం గ్రామస్తులు వేసిన శిక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది.

అనారోగ్యంతో కమలా చితాల్ మృతిచెందడంతో ఆమె మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకు వెళ్లకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. కమలా చితాల్ కోడలు, ఆమె మనవడు రబింద్ర చితాల్లు అంత్య క్రియలకు సహకరించాలని గ్రామస్తులను ప్రాధేయపడ్డారు. వాళ్లు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఒడిశాలోని పూరీ జగన్నాథ్ దేవాలయం మహాప్రసాదానికి రూ. 1000, వారి వంశాన్నితిరిగి గ్రామంలోకి అనుమతించినందుకు మరో రూ.3000 కట్టమన్నారని మధ్యవర్తిత్వం వహించిన గ్రామ వార్డు మెంబర్ సుబ్రాన్సు పరిచా తెలిపారు. దీంతో డబ్బు చెల్లించడంతో శుక్రవారం సాయంత్రం గ్రామస్తులు అంత్యక్రియలకు అనుమతిచ్చారు. కాగా, ఈ సంఘటనపై మల్కాన్‌ గిరి జిల్లా  కలెక్టర్ కే సుదర్శన్ విచారణకు ఆదేశించారు.

మరిన్ని వార్తలు