పౌరసత్వ రగడ: ముగ్గుల వెనుక పాక్‌ హస్తం!

3 Jan, 2020 09:23 IST|Sakshi

ముగ్గు వెనుక మర్మం

చెన్నై యువతికి పాకిస్థాన్‌ సంస్థతో సంబంధాలు!

సాక్షి , చెన్నై: పౌరసత్వ చట్టం సవరణ వ్యతిరేక నినాదాలతో ఒక యువతి వేసిన ముగ్గు వెనుక మర్మం దాగి ఉన్నట్లు పోలీసులు  అనుమానిస్తున్నారు. సదరు యువతికి  పాకిస్థాన్‌ సంస్థతో  సంబంధాలు కలిగి ఉన్నట్లు ఫేస్‌బుక్‌ పరిశీలనలో  తేలిందని గ్రేటర్‌ చెన్నై పోలీస్‌ కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌ తెలిపారు. చెన్నై నగరంలో గత నెల 29వ తేదీన పలువురు యువతులు ఇళ్ల ముందు ముగ్గులు వేశారు. ఇందుకు సంబంధించి ఎనిమిది మంది యువతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో బిసెంట్‌ నగర్‌లోని 92 ఏళ్ల వృద్ధుడి ఇంటి ముందు ముగ్గువేసి గొడవలు సృష్టించిన నేరంపై తిరువాన్మియూర్‌కు చెందిన గాయత్రి కందదై (32)ని కూడా అరెస్ట్‌ చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం పెద్ద చర్చనీయాంశమైంది. దీనిపై బుధవారం సాయంత్రం గ్రేటర్‌ చెన్నై పోలీస్‌ కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌ మీడియాతో మాట్లాడారు. ముగ్గు వేసినందుకు యువతులను అరెస్ట్‌ చేయలేదని, ఇతరులు వేసుకున్న సాధారణ ముగ్గు పక్కనే పౌర చట్టం సవరణ వ్యతిరేక నినాదాలతో కూడిన ముగ్గువేయడం వల్లనే అరెస్ట్‌ చేసి కొద్దిసేపటికే విడిచిపెట్టామని కమిషనర్‌ వెల్లడించారు. (ముగ్గులతో నిరసనలు.. పోలీసుల అదుపులో ఐదుగురు)

అయితే గాయత్రి కందదై పాకిస్థాన్‌లోని ‘ఫైట్స్‌ పార్‌ ఆల్‌’ అనే సంస్థతో సంబంధాలున్నట్లు ఆమె ఫేస్‌బుక్‌ తనిఖీలో తేలిందన్నారు. ఈ సంస్థకు అసోసియేషన్‌ ఆఫ్‌ అల్‌ పాకిస్థాన్‌ సిటిజన్‌ జెనలిస్ట్‌ అనే సంస్థకు సొంతమైందని, అంతేగాక ఆమె నేప«థ్యాన్ని కూడా అనుమానిస్తున్నామన్నారు. తీవ్రవాద సంస్థలతో గాయత్రికి, ఆమె తండ్రికి ఏమైనా సంబంధాలున్నాయా..? అనే కోణంలో విచారిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఇళ్ల ముందు ‘రంగోలి’ తో నిరసన తెలిపిన యువతులను పోలీసులు అరెస్ట్‌ చేసి, కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ చర్యను నిరసిస్తూ డీఎంకే అధినేత స్టాలిన్, తుత్తుకుడి ఎంపీ కనిమొళి ఇళ్ల ముందు కూడా ‘వేండం (వుయ్‌ డోంట్‌ వాంట్‌) సీఏఏ-ఎన్‌ఆర్సీ’  అంటూ ముగ్గులు వేశారు. పౌర సవరణ చట్టానికి తాము వ్యతిరేకం అంటూ రంగోలి ద్వారా తమ నిరసన తెలిపారు. కాగా ఇంటి ముందు ముగ్గులు వేసి నిరసన తెలిపినందుకు సోమవారం కూడా అయిదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు