రాజస్తాన్‌ వ్యక్తి కడుపులో బయటపడిన వస్తువులు

15 May, 2019 09:33 IST|Sakshi

జైపూర్‌ :  ఆపరేషన్‌ ముగిసిన తర్వాత బుండి ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఒకింత షాక్‌కి గురయ్యారు. ఇది కడుపా లేక ఇనుప వస్తువుల దుకాణమా అంటూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సదరు వ్యక్తి కడుపులోంచి వైద్యులు ఇనుప నట్లు, వైరు, ఇనుప గుండు వంటి వస్తువులు బయటకు తీశారు. వివరాలు.. భోలా శంకర్‌ (42) అనే వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతూ.. స్థానిక బుండి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. అతనికి ఎక్స్‌ రే తీసిన వైద్యులు ఆ రిపోర్టులు చూసి ఆశ్చర్యపోయారు. అతని కడుపులో ఏవో వస్తువులు ఉన్నట్లు రిపోర్టుల్లో కనిపించింది. దాంతో ఎందుకైనా మంచిదని సీటీ స్కాన్‌ చేశారు. ఆ రిపోర్టులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించడంతో శంకర్‌కి ఆపరేషన్‌ చేశారు.

ఈ క్రమంలో అతని కడుపులోంచి 6.5 సెంటిమీటర్ల పొడవున్న 116 ఇనుప నట్లతో పాటు.. ఓ వైర్‌, ఇనుప గుండును కూడా బయటకు తీశారు. ఈ వస్తువులు చూసి ఆశ్చర్యపోయిన డాక్టర్లు ఇది కడుపా.. ఇనుప సామాన్ల దుకాణమా అంటూ ఆశ్చర్యపోయారు.  ప్రస్తుతం శంకర్‌ కోలుకుంటున్నాడని.. అయితే ఈ వస్తువులన్ని అతనికి కడుపులోకి ఎలా వెళ్లాయనే విషయం గురించి అతనేం మాట్లాడటం లేదని వైద్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు