స్పీడ్‌ పెరిగింది.. ట్రైన్‌ జర్నీ తగ్గింది!

21 Aug, 2019 18:02 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ- ముంబై మధ్య ప్రయాణించే ప్రయాణికులు మునుపటి కంటే 5గంటలు ముందుగానే తమ గమ్య స్థానానికి చేరుకోవచ్చు. ఎందుకంటే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు వేగాన్ని గంటకు 130 కిలోమీటర్ల నుంచి 160 కిలోమీటర్లకు పెంచాలని భారత రైల్వే సంస్థ యోచిస్తోంది. వేగాన్ని పెంచడంతో ప్రస్తుతం 15.5 గంటలు ఉన్న ప్రయాణ సమయం 10 గంటలకు తగ్గుతుంది.

కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత, మిషన్‌ రఫ్తార్‌లో భాగంగా ముంబై- ఢిల్లీ మధ్యలో నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని, దీంతో ప్రయాణ సమయం 5 గంటలకు తగ్గుతుందని పశ్చిమ రైల్వే ఒక ట్వీట్‌లో పేర్కొంది. 

భారత రైల్వే సంస్థ తన 100 రోజుల కార్యాచరణలో భాగంగా, ఢిల్లీ- ముంబై, ఢిల్లీ- హౌరా మార్గాల్లో ప్రయాణ సమయాన్ని తగ్గించాలని ప్రతిపాదించింది. ఇందుకుగాను  ‘మిషన్ రఫ్తార్’ను 2016-17 రైల్వే బడ్జెట్‌లో మొదటగా ప్రకటించారు. సరుకు రవాణా రైళ్ల సగటు వేగాన్ని రెట్టింపు చేయడం, రానున్న 5 సంవత్సరాలలో నాన్‌- సబర్బన్ ప్రయాణీకుల రైళ్ల సగటు వేగాన్ని 25 కిలోమీటర్ల మేర పెంచడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం.

'మిషన్ రఫ్తార్' కింద వేగం పెంచడానికి స్వర్ణ చతుర్భుజితోపాటు ఆరు ప్రధాన మార్గాలైన ఢిల్లీ- ముంబై, ఢిల్లీ- హౌరా, హౌరా- చెన్నై, చెన్నై- ముంబై, ఢిల్లీ-  చెన్నై, హౌరా- ముంబైలను లక్ష్యంగా చేసుకొంది. భారత రైల్వే సంస్ధ గుర్తించిన ఈ ఆరు మార్గాలలో 58 శాతం సరుకు రవాణా, 52 శాతం కోచింగ్ ట్రాఫిక్‌ను, 16 శాతం నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి. 

మరిన్ని వార్తలు