సమాచార కమిషనర్ల భర్తీలో ఇంత నిర్లక్ష్యమా?

28 Jul, 2018 03:00 IST|Sakshi

ఏపీ, తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలు, కేంద్రానికి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) తోపాటు రాష్ట్రాల సమాచార కమిషన్ల (ఎస్‌ఐసీ)లో పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటంపై సుప్రీంకోర్టు స్పందించింది. సీఐసీ, ఎస్‌ఐసీల్లో ఖాళీ పోస్టులను ఎప్పటిలోగా భర్తీ చేస్తారో తెలపాలని కేంద్రానికి, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఒడిశాలకు నోటీసులిచ్చింది. 4వారాల్లోగా అఫిడవిట్‌ సమర్పించకుంటే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందంది. సమాచార హక్కు కార్యకర్త అంజలి భరద్వాజ్‌ తదితరులు వేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది.

‘ప్రస్తుతం సీఐసీలో 4 పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి ప్రధాన సమాచార కమిషనర్‌ సహా మరో నాలుగు పోస్టులు ఖాళీ కానున్నాయి. ‘సీఐసీలో 23వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఐసీలో ఒక్క సభ్యుడినీ నియమించలేదు.  ప్రధాన సమాచార కమిషనర్‌ లేకుండానే గుజరాత్, మహారాష్ట్ర కమిషన్లు నడుస్తున్నాయి’ అని  పిటిషనర్‌ తరఫు లాయరు ప్రశాంత్‌ భూషణ్‌ అన్నారు. సీఐసీ, ఎస్‌ఐసీలకు  కమిషనర్లను నియమించకుండా కేంద్ర, రాష్ట్రాలు స.హ. చట్టాన్ని నీరుగారుస్తున్నాయన్నారు.

మరిన్ని వార్తలు