అశ్లీల వీడియోలు వీక్షిస్తే.. ఏడేళ్ల జైలు

9 Dec, 2019 07:56 IST|Sakshi

పోలీసుల హెచ్చరికలు

అదే పనిగా చూస్తున్న 3 వేల మంది గుర్తింపు

సమన్లు జారీ  

బెదిరింపు ఆడియో కలకలం

సాక్షి, చెన్నై : చేతిలో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్‌లు, ఆన్‌లైన్‌ సౌకర్యంతో స్మార్ట్‌ టీవీలు ఉన్నాయి కదా అని అదే పనిగా గంటల కొద్ది అశ్లీల వీడియోలను వీక్షిస్తే, ఇక సైబర్‌ క్రైంకు చిక్కినట్టే. ఐపీ అడ్రస్‌ల ఆధారంగా వారిని గుర్తించే పనిలో పోలీసులు బిజీ అయ్యారు. హెచ్చరికల్ని ఖాతరు చేయకుంటే, ఏడేళ్లు జైలు శిక్ష విధించేందుకు తగ్గట్టుగా కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో పోర్న్‌ వీడియోలను వీక్షిస్తున్న మూడు వేల మందిని గుర్తించి, వారికి క్లాస్‌ పీకేందుకు సైబర్‌ క్రైం సిద్ధం అయింది. ఈ మేరకు ఓ యువకుడికి పోలీసు లు వార్నింగ్‌ ఇస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో కలకలం రేపుతోంది. పోర్న్‌ వీడియోలను వీక్షించే వారి సంఖ్య భారత్‌లో అత్యధికంగా ఉన్నట్టు ఓ సర్వే తేల్చిచెప్పింది. ఇష్టారాజ్యంగా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయ్యే ఈ వెబ్‌ సైట్లను అరికట్టడం సైబర్‌ విభాగానికి పెద్ద సమస్యే. ఈ వీడియోలకు తగ్గట్టుగానే, ఇటీవల కాలంగా మహిళలు, యువతులు, పిల్లలల మీద లైంగిక దాడులు, ఉన్మాద చర్యలు  పెరిగి ఉన్నాయి. హైదరాబాద్‌లో సాగిన దిశా హత్య ఉదాంతం తదుపరి రాష్ట్ర పోలీసు యంత్రాంగం ముందు జాగ్రత్తల్లో పడింది. మహిళలకు, పిల్లలకు  భద్రత కల్పించే రీతిలో దూకుడు పెంచి ఉన్న పోలీసుల యంత్రాంగం మరో అడుగు ముందుకు వేసింది. అశ్లీల వీడియోలను అదే పనిగా గంటల కొద్ది వీక్షించే వారి భరతం పట్టే రీతిలో పోలీసులు కొరడా ఝుళిపించేందుకు సిద్ధం అయ్యారు. వెబ్‌ సైట్లలో అశ్లీల వీడియోలను వీక్షించే వారిని గుర్తించే పనిలో సైబర్‌ క్రైం విభాగంలో ప్రత్యేక  బృందం రంగంలోకి దిగి ఉన్నది. 

మూడువేల మందితో జాబితా..
చిన్న పిల్లల్ని, మైనర్లను అశ్లీలంగా చిత్రీకరించి తీసిన వీడియోలే కాదు. అశ్లీల సైట్స్‌ల్లో గంటల కొద్ది గడిపే వారిని గుర్తించి వారి భరతం పట్టే విధంగా పోలీసులు దూకుడుపెంచారు. తమిళనాట మూడు వేల మంది నిత్యం పోర్న్‌ వీడియోల మీదే దృష్టి పెట్టి ఉన్నట్టుగా ఇప్పటి వరకు తేల్చారు. జిల్లాల వారీగా సేకరించిన సమాచారాల ఆధారంగా, వారి వారి ఫోన్ల, ఇతర ఐపీ అడ్రస్‌ల ఆధారంగా వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ మూడు వేల మందిని పిలిపించి క్లాస్‌ పీకేందుకు రెడీ అవుతున్నారు. అశ్లీల వీడియోలను వీక్షించినా, డౌన్‌లోడ్‌ చేసినా, షేర్‌ చేసినా నేరంగా పరిగణించి, అటి వారిని తొలుత హెచ్చరించడం, ఖాతరు చేయని పక్షంలో ఏడేళ్లు జైలు శిక్ష విధించే దిశగా కేసుల్ని పెట్టేందుకు తగ్గట్టుగా ప్రత్యేక కార్యచరణతో ఆ బృందం ముందుకు సాగుతోంది. ఈ దృష్ట్యా, అశ్లీల వీడియోలను అదే పనిగా గంటల కొద్ది చూసే వాళ్లు, ఉన్మాదంతో వ్యవహరించే వాళ్లు, కామాంధులు ఇకనైనా జాగ్రత్త పడితే సరి లేదా.. వీడియోల రూపంలో ఏడేళ్ల కటకటాల్లో కాలం గడపాల్సిన పరిస్థితి తప్పదు. 

ఆడియో కలకలం..
తిరునల్వేలిలో పదిహేను మందిని గుర్తించి, వారిని పోలీసులు తీవ్రంగా హెచ్చరించినట్లు తాజా సమాచారం. ఓ యువకుడికి ఫోన్లో వార్నింగ్‌ ఇస్తూ, ఏడేళ్లు జైలు శిక్ష అని మందలిస్తున్న ఆడియో ఇప్పుడు తమిళనాట వైరల్‌ అయింది. ఇక మీదట తాను ఆ వీడియోలను వీక్షించబోనని ఆ యువకుడు బోరు మంటూ విలపించడం గమనార్హం. అయితే, తాము ఇంత వరకు ఎవరికి ఫోన్లలో హెచ్చరికలు ఇవ్వలేదని, స్వయంగా పిలిపించి మందలించి పంపుతున్నట్టు పోలీసులు పేర్కొంటున్నారు. 

సురక్షిత నగరం...
ఇక్కడి పోలీసు యంత్రాంగం తీసుకుంటున్న చర్యలతో తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూరు నగరాలు మహిళలు, పిల్లల సురక్షిత ప్రాంతాలుగా ఉన్నట్టు సర్వేలో తేలింది. ఈ నగరాల్లో హత్యలు, ఆస్తుల వివాదాలు, మోసాలు వంటి నేరాలు సాగినా, ఇతర రాష్ట్రాల్లోని నగరాలతో పోల్చితే, మహిళలు, పిల్లల మీద దాడుల కేసులు తక్కువేనని ఆ సర్వేలో తేలింది. మహిళలు, పిల్లలకు భద్రత కల్పించే రీతిలో ఇక్కడి పోలీసు యంత్రాంగం తీసుకుంటున్న చర్యలతో ఈ రెండు నగరాలను ఆ సర్వే మేరకు సురక్షిత నగరాలుగా ప్రకటించారు.

మరిన్ని వార్తలు