మహిళను కాల్చి చంపిన దుండగులు

2 Mar, 2016 21:21 IST|Sakshi
మహిళను కాల్చి చంపిన దుండగులు

ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ప్రాంతంలో అగంతకులు రెచ్చిపోయారు. డబ్బుకోసం ఓ మహిళను కాల్చి చంపారు. లూటీ చేయడానికి వచ్చిన ముగ్గురు దుండగులు డబ్బును కాజేయడంతోపాటు, మహిళను కడతేర్చిన ఘటన ఫూల్ బెహర్ పోలీస్ స్టేషన్ పరిథిలో జరిగింది. రెండు లక్షల రూపాయలతో ప్రయాణిస్తున్న కుటుంబాన్ని  వెంటాడిన సాయుధ దుండగులు అగ్గర్ ఖుర్ద్ గ్రామ సమీపంలో మహిళను కాల్చి చంపి వారివద్ద ఉన్న డబ్బును దోచుకు వెళ్ళినట్లు పోలీసులు తెలిపారు.  

35ఏళ్ళ ఆర్తీ దేవి, ఆమె భర్త ఆశిష్ కుమార్ తమ రెండేళ్ళ కొడుకు, ఓ బంధువుతోపాటు ప్రయాణిస్తున్నారు. ఉన్నట్లుండి వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని సాయుధ దుండగులు వారివద్ద ఉన్న డబ్బును లాక్కునేందుకు ప్రయత్నించారు. అయితే వచ్చిన ముగ్గురిలో ఒకరిని ఆర్తీ దేవి గుర్తించడంతో వెంటనే ఆమెను పిస్టల్ తో కాల్చి చంపి, డబ్బును లూటీ చేశారు.

ఇటీవల తాము కొనుక్కున్న భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం రెండు లక్షల రూపాయల డబ్బుతో పాటు తమ అత్తమామల వద్దకు బయల్దేరామని, అగ్గర్ ఖుర్ద్ గ్రామ సమీపంలోకి వచ్చేసరికి అగంతకులు డబ్బును లూటీ చేయడమే కాక  తన భార్యను తుపాకీతో కాల్చి చంపారని కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దుండగుల జాడ తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించామని డీఎస్పీ మనోజ్ కుమార్ తెలిపారు.

మరిన్ని వార్తలు