‘బీజేపీకి మతిపోవడం ఖాయం’

13 Dec, 2017 15:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్‌ ప్రజలు బీజేపీకి మతిపోయే బదులు ఇవ్వనున్నారని కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్‌ గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ ఓటమి పాలయితే అది తన నాయకత్వ పటిమకు ప్రజాభిప్రాయంగా భావిస్తున్నారని కానీ, గుజరాత్‌లో మాత్రం కచ్చితంగా షాకింగ్‌ ఫలితాలు రావడం ఖాయం అని ఆయన చెప్పారు. ‘ఈసారి గుజరాత్‌ అంతా ఆశ్చర్యపోయేలా అద్భుతమైన ఫలితాలు ఇవ్వనుంది. అది బీజేపీకి మతి పోగొడుతుంది. వాళ్లు(బీజేపీ ప్రతినిధులు) భయపడ్డారు. మా నాయకులతో మాట్లాడిన బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీ చాలా అద్భుతంగా ప్రచారం చేసిందని చెబుతున్నారు.

అదే సమయంలో వారి ప్రచారం బాగాలేదని చెప్పారు’ అని రాహుల్‌ అన్నారు. గుజరాత్‌ ఎన్నికల ఫలితాలను తన నాయకత్వానికి రిఫరెండంగా భావించవచ్చా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మాత్రం బదులు ఇవ్వలేదు. పాకిస్థానీయులతో కలిసి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ కుట్ర చేశారంటూ మోదీ చేసిన ఆరోపణలను రాహుల్‌ తీవ్రంగా ఖండించారు. ‘మోదీ చేసింది చాలా పెద్ద తప్పు.. మోదీ ప్రధాని అయినట్లే మన్మోహన్‌ సింగ్‌ కూడా ఒక ప్రధానే. ఆయన తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేశారు. మోదీ ఆయనకు తప్పకుండా క్షమాపణ చెప్పి తీరాలి’ అని రాహుల్‌ అన్నారు.

మరిన్ని వార్తలు