'నాకు జొమాటో, స్విగ్గీ ఫుడ్‌ కావాలి'

2 Mar, 2018 22:20 IST|Sakshi
కార్తీ చిదంబంరం

సీబీఐ అధికారులతో కార్తి చిదంబరం

న్యూఢిల్లీ : తనకు జొమాటో, స్విగ్గీ కంపెనీలనుంచి ఆహారం తెప్పించాలని ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కార్తి చిదంబరం...సీబీఐ అధికారులను కోరారు. ఇంటినుంచి వచ్చే ఆహారం తినేందుకు ప్రత్యేక కోర్టు గురువారం నిరాకరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ రెండు కంపెనీల్లో ఏదో ఒకదానినుంచి ఆహారం తెప్పించాలని సంబంధిత అధికారులకు విన్నవించారు.  

కార్తి అరెస్టు సబబే : స్వామి  
ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కార్తి చిదంబరంను సీబీఐ కస్టడీకి పంపడం సమంజసమేనని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. న్యాయస్థానం సరైన నిర్ణయం తీసుకుందన్నారు. కార్తి తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వి చేసిన వాదనలు నిజాలు కావని, అందువల్లనే కార్తీని సీబీఐ కస్టడీకి కోర్టు ఆదేశించిందని ఈ సందర్భంగా చెప్పారు. లావాదేవీలన్నీ అక్రమేనంటూ కార్తి వద్ద పనిచేస్తున్న చార్టర్డ్‌ ఎకౌంటెంట్‌ ఇప్పటికే నిర్ధారించారని, అందువల్ల కార్తితోపాటు ఆయన సీఏ భాస్కర్‌రామను విచారించేందుకు మార్గం సుగమవుతుందన్నారు. కార్తిని విచారించడంవల్ల ఈ కేసులో చిదంబరం ప్రమేయం నిర్ధారణ అవుతుందని, ఇందువల్ల ఈ కేసును ప్రాసిక్యూషన్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమవుతుందని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు