మీ పిల్లలే ఉన్నత విద్యలు చదవాలా..?

22 Nov, 2019 17:15 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : టీడీపీ నేతల పిల్లు ఏ మీడియంలో చదువుకుంటున్నారని వేమూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ప్రశ్నించారు. శుక్రవారం తాడేపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశ పెడితే టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. కేవలం టీడీపీ నేతల పిల్లలే ఉన్నత విద్య చదవాలా.. పేద పిల్లలు ఉన్నత విద్య చదవకూడదా అని నిలదీశారు. చంద్రబాబుకు దమ్ముంటే ఇదే విషయాన్ని మీడియా ముందు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసే చెత్త పలుకులు అందరికీ తెలుసని, రాధాకృష్ణకు చేతనైతే చంద్రబాబు దగ్గర చప్రాసి ఉద్యోగం చేసుకోవాలని ఎద్దేవా చేశారు.

బాబు ఎందుకు నోరు మెదపడం లేదు
ఇంగ్లీష్‌ మీడియం చదివితే మత ప్రచారం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మేరుగ నాగార్జున మండిపడ్డారు. సీఎం జగన్‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చంద్రబాబు పెయిడ్‌ ఆర్టిస్టులను పెట్టారని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు చూసి చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌ కుటుంబంపై మత రాజకీయాలు చేస్తే చంద్రబాబు మట్టి కొట్టుకుపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నలబై ఏళ్ల అనుభవం.. 40 ఏళ్ల వయస్సు ఉన్న సీఎం జగన్‌ చేతిలో పటాపంచలు అయ్యిందని ఎద్దేవా చేశారు. ఏపీకి చెందిన ఒక ముఖ్యుడికి రూ. 150 కోట్లు అందాయని జరుగుతున్న ప్రచారంపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు