సాక్షి, హైదరాబాద్: అధికారంపై యావతోనే కాంగ్రెస్ నేత లు బస్సు యాత్ర చేస్తున్నారని, ముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి, తరువాత యాత్ర చేపట్టాలని ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్రెడ్డి డిమాం డ్ చేశారు. సోమవారం టీఆర్ఎస్ ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి తెలంగాణ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడారు.
అధికారంలో ఉన్నంతకాలం ప్రాజెక్టులు పూర్తిచేయలేని కాంగ్రెస్ దద్దమ్మలకు అధికారం పోయిన తర్వాత ప్రాజెక్టులు గుర్తొస్తున్నాయని విమర్శించారు. 30 ఏళ్లలో పూర్తికాని ప్రాజెక్టులను టీఆర్ఎస్ మూడేళ్లలో పూర్తిచేస్తుందన్నారు. ప్రాణాలను అడ్డుపెట్టి సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదాపైనే పెడ్తామని కేంద్ర మాజీమంత్రి జైరాం రమేశ్ ప్రకటనకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలన్నారు.