స్పష్టం చేసిన నితీష్‌ కుమార్‌

31 May, 2019 16:02 IST|Sakshi

పట్నా : ఎన్డీయే మిత్రపక్షంగా మాత్రమే ఉంటాము.. మోదీ కేబినెట్లో కొనసాగబోమంటున్నారు బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌. మోదీ కేబినెట్‌లో జేడీయూకు కేవలం ఒక్క మంత్రి పదవి మాత్రమే కేటాయించారు. దీని పట్ల నితీష్‌ కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాము మోదీ ప్రభుత్వంలో చేరడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నితీష్‌ కుమార్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మోడీ కేబినెట్లో జేడీయూకు ఒక మంత్రి పదవి ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. ఏదో పేరుకు మంత్రి పదవి ఇస్తామంటే ఆ పదవి తమకు అక్కర్లేదని తేల్చి చెప్పారు నితీష్. అయితే బీజేపీ జేడీయూల మధ్య బంధం కొనసాగుతుందన్నారు. కానీ మోదీ కేబినెట్‌లో మాత్రం చేరబోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీయే మిత్రపక్షంగా మాత్రమే ఉంటామని నితీష్‌ స్పష్టం చేశారు.

ఎన్డీయే మిత్ర పక్షాలకు ఒక్కో మంత్రి పదవి ఇస్తామని అమిత్ షా చెప్పినప్పుడే ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు నితీష్ కుమార్ చెప్పారు. ఇక బీజేపీ ఇచ్చిన ఆఫర్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది జేడీయూ. ఒక్క మంత్రి పదవే ఇవ్వడం.. అందులోనూ ప్రాధాన్యత లేని పోర్ట్‌ఫోలియో ఇవ్వడం పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. 2017 లో జేడీయూ బీజేపీతో చేతులు కలిపిన తర్వాత కూడా మోడీ కేబినెట్‌లో చేరలేదు. అయితే ఈసారి బీజేపీ మిత్రపక్షంగా బీహార్‌లో 17 సీట్లలో పోటీ చేసిన జేడీయూ 16 సీట్లను కైవసం చేసుకుంది. ఈసారి మంచి ప్రాధాన్యత ఉన్న పోర్ట్‌ఫోలియో కలిగిన మంత్రి పదవులను జేడీయూ ఆశిచింది. అయితే ఒక్క మంత్రి పదవి ఇవ్వడాన్ని జేడీయూ వ్యతిరేకించింది.

>
మరిన్ని వార్తలు