అది మా రక్తంలోనే లేదు: స్టాలిన్‌

2 Jun, 2019 13:56 IST|Sakshi

సాక్షి, చెన్నై: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీని నేర్పించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి రమేష్‌ పోకిరియాల్‌ నిషాకు శుక్రవారం  సిఫార్సు  చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్టాలిన్‌ మాట్లాడుతూ.. ‘‘హిందీ తమిళుల రక్తంలోనే లేదు. అది మాకు అవసరంలేదు. కొత్తగా రూపొందిన ఈ విధానం తమిళులను రెచ్చగొట్టేవిధంగా ఉంది. మా రాష్ట్రంలో హిందీకి స్థానం లేదు. దేశాన్ని విడుగొట్టే విధంగా హిందీని బలవంతంగా రుద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేపై పార్లమెంట్‌లో పోరాడుతాం’ అని స్పష్టం చేశారు.

హిందీ భాషను బలవంతంగా రుద్దితే డీఎంకే అడ్డుకుంటుందని ఆ పార్టీ అగ్రనేత, లోక్‌సభ సభ్యురాలు కనిమొళి హెచ్చరించిన విషయం తెలిసిందే.  శనివారం ఉదయం చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, కొత్త విద్యావిధానం కింద ఇంగ్లిషు తరువాత హిందీ పాఠ్యాంశాన్ని విధిగా అభ్యసించాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. పార్లమెంటు సమావేశాల్లో హిందీకి వ్యతిరేకంగా డీఎంకే గళం వినిపిస్తానని చెప్పారు. కాగా దేశంలో సరికొత్త విద్యావిధానాన్ని అమలుచేస్తామని 2014 నాటి ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చిన విషయంతెలిసిందే. ఈ హామీ మేరకు ఇస్రో మాజీ చైర్మన్‌ కస్తూరీ రంగన్‌ నేతృత్వంలో తొమ్మిది మందితో కూడిన నిపుణుల కమిటీని కేంద్రం నియమించింది. ఈ కమిటీ తన నివేదికను కేంద్ర మంత్రి రమేష్‌ పోకిరియాల్‌ నిషాకు శుక్రవారం సమర్పించింది. కొత్త జాతీయ విద్యాపథకం లక్ష్యాలను అందులో పొందుపరిచింది.

మరిన్ని వార్తలు