50 మంది నేతలకు రెండు పెళ్లిళ్లు..!

5 Jul, 2018 19:21 IST|Sakshi

ఇస్లామాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాకిస్తాన్‌లో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న దాదాపు 50 మందికి పైగా నేతలకు రెండు పెళ్లిళ్లు అయ్యాయనేది దాని సారాంశం. ఈ మేరకు ఆ దేశానికి చెందిన దున్యా న్యూస్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. వారి వారి నామినేషన్ పత్రాల్లో ఈ మేరకు నేతలు సంతకాలు కూడా చేశారని పేర్కొంది. దీంతో ఇప్పటివరకూ సదరు నేతలకు రెండో పెళ్లైందని తెలియని స్థానిక మీడియా అవాక్కైంది.
 
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆయన కుమారుడు హమ్‌జా షెహబాజ్, నేషనల్ అసెంబ్లీలోని మాజీ ప్రతిపక్ష నేత సయీద్ ఖుర్షీద్ షా, ఎమ్‌క్యూఎమ్ చీఫ్ ఫరూక్ సత్తార్, మాజీ రైల్వే మంత్రి ఖవాజా సాద్ రఫీక్ సహా పలువురు ప్రముఖులకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ఓటర్ల ముందు పారదర్శకంగా వ్యవహించేందుకే వీరంతా తమ వ్యక్తిగత జీవితంలోని అజ్ఞాత అంశాలను వెల్లడించినట్టు తెలుస్తోంది.

పీఎమ్ఎల్ఎన్ నేత, మాజీ రైల్వే మంత్రి ఖవాజా సాద్ రఫీక్ తన రహస్యాలను సోషల్ మీడియాలో వెల్లడించిన తొలినేతగా నిలిచారు. నామినేషన్ పత్రాల్లో రెండో పెళ్లి గురించి ప్రస్తావించిన తర్వాత ఆయన బయటి ప్రపంచానికి ఈ విషయం తెలియజేశారు.

మరిన్ని వార్తలు