కశ్మీరీలపై దాడులు.. మౌనం వీడిన మోదీ

23 Feb, 2019 20:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పూల్వామా ఉగ్రవాద దాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న కశ్మీరీలపై జరుగుతున్న దాడులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఖండించారు. అలాంటి దాడులకు దేశంలో తావు లేదని ఆయన స్పష్టం చేశారు. మానవత్వానికి శత్రువైన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ పోరాటం చేస్తుందే కానీ, కశ్మీర్‌కు, కశ్మీరీలకు వ్యతిరేకంగా కాదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. గతవారం పూల్వామాలో సైనిక కాన్వాయ్‌ లక్ష్యంగా జరిగిన ఉగ్రవాద దాడిలో 40మందికిపైగా జవాన్లు మృతిచెందడంతో.. పలు రాష్ట్రాల్లో కశ్మీరీలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. దాడులు నివారించేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు సత్వరమే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో శనివారం రాజస్థాన్‌ టాంక్‌ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. కశ్మీరీలపై దాడుల అంశం మీద తొలిసారిగా స్పందించారు. ‘ఇటీవలికాలంలో సోషల్‌ మీడియాలో వీరరసం ఉప్పొంగుతోంది. కానీ మన సోదరులు, అక్కాచెల్లెళ్లు ఒక్క విషయం గుర్తించాలి. మన పోరాటం ఉగ్రవాదం, మానవాళికి శత్రువులైనవారిపై మాత్రమే. మన కశ్మీరీల కోసం పోరాడుతున్నాం. కానీ వారికి వ్యతిరేకంగా కాదు. గత కొన్నిరోజులుగా దేశంలో పలుచోట్ల కశ్మీరీలకు వ్యతిరేకంగా జరిగింది చిన్నదైనా కానివ్వండి.. పెద్దదైనా కానివ్వండి. అలాంటి వాటికి దేశంలో తావులేదు. అవి దేశంలో జరగకూడదు. కశ్మీరీ పిల్లలు ఉగ్రవాదంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి మనతో చేతులు కలిపేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. వారిని మనం కలుపుకొని ముందుకుసాగాలి’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు