కర్ణాటకం : కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతల కీలక భేటీ

14 Jul, 2019 19:05 IST|Sakshi

బెంగళూర్‌ : కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడిన క్రమంలో రెబెల్‌ ఎమ్మెల్యేలను తిరిగి సంకీర్ణ శిబిరానికి చేర్చాలనే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. అసంతృప్త ఎమ్మెల్యేలు బెట్టువీడకపోవడంతో వారిని దారిలోకి తెచ్చేందుకు సంకీర్ణ నేతలు మంతనాలు జరుపుతున్నారు. సంకీర్ణ సర్కార్‌ను కాపాడుకోవడమే లక్ష్యంగా ఆదివారం సాయంత్రం సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు, సీఎం కుమారస్వామి సహా కాంగ్రెస్‌-జేడీఎస్‌ ముఖ్యనేతలు సమావేశమయ్యారు.

కుమరప్ప గెస్ట్‌ హౌస్‌లో జరిగిన ఈ భేటీలో సీఎం కుమారస్వామితో పాటు కాంగ్రెస్‌ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ హాజరయ్యారు. రెబెల్‌ ఎమ్మెల్యేల బుజ్జగింపు చర్యలతో పాటు అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్షలో నెగ్గేందుకు అవసరమైన వ్యూహాలపై నేతలు చర్చించారు. మరోవైపు రాజీనామాలపై మరోమాట లేదని రెబెల్‌ ఎమ్మెల్యేలు తేల్చిచెప్పడం, బీజేపీ సైతం ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతుండటంతో కన్నడ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని వార్తలు