కాంట్రాక్ట్‌ విధానం తగదు

25 Jan, 2018 10:51 IST|Sakshi

విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల శిబిరం సందర్శన

రిలే దీక్షలకు సంఘీభావం

ప్రకటించిన ఎంపీ విజయసాయిరెడ్డి

ఉద్యోగాల్లో, పనుల్లో కాంట్రాక్ట్‌ విధానం ఉండకూడదని.. కార్మిక చట్టాలు దీన్నే స్పష్టం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఉద్యోగ భద్రత కోసం కొద్ది రోజులుగా రిలే దీక్షలు చేస్తున్న విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగలకు ఆయన సంఘీభావం ప్రకటించారు. కాంట్రాక్ట్‌ విధానాన్ని రద్దు చేసి.. ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. విశాఖ పర్యటిస్తున్న ఆయన్ను అగనంపూడి టోల్‌ప్లాజా బాధితులు కూడా కలిసి ప్లాజా అక్రమంగా కొనసాగుతున్న తీరును వివరించారు.

ద్వారకానగర్‌(విశాఖ దక్షిణ): విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రతతో పాటు అన్ని సదుపాయాలు కల్పిం చాలని  వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభసభ్యుడు వి.విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో  చేపట్టిన రిలే నిరహరదీక్షలు బుధవారం నాటికి  ఐదో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆ పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్‌ సంఘీభావం తెలిపా రు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్‌ విద్యుత్‌ కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.  ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘిస్తుంటే,  ప్రైవేట్‌ యాజమాన్యలు ఉల్లంఘించవా అని ప్రశ్నించారు.  కాంట్రాక్టు కార్మికులను వెంటనే రెగ్యులేజషన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు . సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు.

కాంట్రాక్ట్‌ విధానం తగదు
ప్రమాదకర పని ప్రదేశాల్లో కాంట్రాక్టు పద్ధతి ఉండకూడదని కార్మికచట్టం చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాలికి వదిలేస్తుందన్నారు. ఉద్యోగులను జెన్‌కో,ట్రాన్స్‌కో, డిస్కమ్‌లలో విలీనం చేసి అనుభవం, వయస్సు పరిగణలోకి తీసుకుని క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో  వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా మధుసూదనరెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శులు పక్కి దివాకర్, జి. రవిరెడ్డితో పాటు గాజువాక, దక్షిణ సమన్వయకర్తలు  తిప్పల నాగిరెడ్డి, కోలా గురువులు, నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి, జాన్‌వేస్లీ, ఎం.డి.షరీఫ్, మూర్తియాదవ్, పేర్ల విజయచందర్, మాజీ కార్పొరేటర్‌ వల్లీ, విద్యుత్‌ జేఏసీ చైర్మన్‌ ఎన్‌.ఎన్‌.మూర్తి, జిల్లా ఇన్‌చార్జి డి. చంద్రశేఖర్, కె.జగదీష్, జి. సంతోష్‌కుమార్, ఎస్‌. చంద్రశేఖర్,ఎ.శ్రీనివాసరావు  పాల్గొన్నారు.

లహరికకు విజయసాయిరెడ్డి పరామర్శ
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): విద్యుత్‌ షాక్‌కు గురై  కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న చిన్నారి లహరికను బుధవారం వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పరామర్శించారు. ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ పి.వి.సుధాకర్, కె.జి.హెచ్‌. రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌తో మాట్లాడి పాప ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించి త్వరగా కోలుకునేలా చూడాలని కోరారు. పాప తండ్రి శ్రీనివాస్‌తో మాట్లాడి ధైర్యంగా ఉండమని, ఏ అవసరమొచ్చినా తనను కలవమని చెప్పారు. ఆయన వెంట ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఐ.టి. విభాగ అధ్యక్షుడు చల్లా మధుసూదన్‌రెడ్డి,  వైఎస్సార్‌సీపీ విశాఖ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయ్‌కుమార్, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, రాష్ట్ర అదనపు కార్యదర్శులు పక్కిదివాకర్, జి.రవిరెడ్డి, సమన్వయకర్తలు తిప్పలనాగిరెడ్డి, కోలా గురువులు ఉన్నారు.

మరిన్ని వార్తలు